
సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నాం:పవన్
హైదరాబాద్: అంతర్వేది ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరటాన్ని స్వాగతిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అయితే సీబీఐ దర్యాప్తు అంటే పరిష్కారం కాదని, నిందితుల్ని పట్టుకోవడానికి వేసిన తొలిఅడుగు మాత్రమేనని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తలపెట్టిన ఛలో అంతర్వేది కార్యక్రమాన్ని విరమించుకుంటునట్టు ప్రకటించారు. అయితే ధర్మ సంస్థాపనార్థం తలపెట్టిన మహిళల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు.
ఇదే విషయమై పవన్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘దర్యాప్తు అంటే అంటే గొడవ జరిగిందని అర్థం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి. దాని వైపు వేసే తొలి అడుగే సర్వేజనా ‘సుఖినోభవంతు’. భవిష్యత్తులో ఏ మతస్థుల మనోభావాలు దెబ్బతినేలా దుశ్చర్యలు జరగకూడదని జనసేన కోరుకుంటోంది. అంతర్వేదిలో అరెస్టు చేసిన వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించీ సీబీఐ ఆరా తీయాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఇదే విషయమై రమణ దీక్షితులు గత ప్రభుత్వ హయాంలోనే సంచలన విషయాలు చెప్పారన్నారు. తిరుమల శ్రీవారికి శ్రీకృష్ణ దేవరాయలవారు ఇచ్చిన ఆభరణాల గురించీ ఆరా తీయాలన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న అంతర్వేదీ ఆలయ భూములు అన్యాక్రాంతమైపోయాయని, రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తులు అన్యులపరమైపోయాయని పవన్ కల్యాణ్ అన్నారు. వీటి గురించీ సీబీఐ ఆరా తీసీ ఎండోమెంట్స్ ఆస్తులకు రక్షణ ఇవ్వాలన్నారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనకే సీబీఐ పరిమితం కాకుండా పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, కొండబిట్రగుంట రథం దగ్ధం వెనుక ఎవరు ఉన్నారో సీబీఐ నిగ్గుతేల్చాలన్నారు. ఈ మూడు దుశ్చర్యలూ ఒకేలా ఉన్నాయని, పిఠాపురం, కొండ బిట్రగుంటల్లోని ఘటనల్నీ సీబీఐ పరిదిలోకి తీసుకువెళ్లండి ప్రభుత్వానికి సూచించారు.