PM Modi: భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో అధిష్ఠానం కీలక భేటీ

పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభం తర్వాత ప్రధాని మోదీ.. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులతో కీలక భేటీ నిర్వహించారు.

Published : 28 May 2023 21:26 IST

దిల్లీ: భాజపా (BJP) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులతో దిల్లీలో (Delhi) ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆరా తీశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎలా సమాయత్తమవ్వాలన్న దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP nadda), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah), మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి, గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, నాగాలాండ్‌ ఉపముఖ్యమంత్రి యంతుంగో పట్టన్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, త్రిపుర సీఎం మానిక్‌ సాహా హాజరయ్యారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత ఇవాళ సాయంత్రం ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చేఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచి భాజపా క్షేత్రస్థాయిలో సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ అమృత కాలం భారతదేశ అభివృద్ధికి సరికొత్త మార్గాన్ని చూపిస్తుందని మోదీ అన్నారు. పార్లమెంట్‌ నూతన భవనం కేవలం ఓ నిర్మాణం మాత్రమే కాదని.. 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షల, కలల ప్రతిబింబమని మోదీ అన్నారు. భారత్‌ దృఢ సంకల్ప సందేశాన్ని ఈ కొత్త భవనం ప్రపంచానికి తెలియజేస్తుందని అన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని