Elections: పంచతంత్రంలో.. చాలు, ఇక గోల్‌ కొట్టడమే మిగిలుంది..

మరికొన్ని రోజుల్లో దేశంలోని ఐదు(ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, ఉత్తరఖండ్‌, మణిపూర్‌) రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నగారా మోగిన నాటి నుంచే రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలను మొదలుపెట్టాయి. నేతలంతా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. నిత్యం ప్రజల నోళ్లలో

Published : 01 Feb 2022 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొన్ని రోజుల్లో దేశంలోని ఐదు(ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌) రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నగారా మోగిన నాటి నుంచే రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలను మొదలుపెట్టాయి. నేతలంతా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. నిత్యం ప్రజల నోళ్లలో నానేలా ఆకర్షణీయ నినాదాలను ఇస్తున్నారు. సోషల్‌మీడియా ప్రచారాల్లో పార్టీలకు మద్దతుగా హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు పెడుతున్నారు. మరి ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల నినాదాలు, హ్యాష్‌ట్యాగ్‌లేవో ఓ సారి చూద్దామా..

ఉత్తరప్రదేశ్‌

దేశంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న(403) రాష్ట్రం.. ఉత్తరప్రదేశ్‌.  దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల ఈ రాష్ట్రంలో ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం పరిపాలన సాగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు భాజపా, కాంగ్రెస్‌, సమాజ్‌వాది, బహుజన సమాజ్‌వాది పోటీ పడుతున్నాయి.

భాజపా: సోచ్‌ ఇమాన్‌దార్‌, కామ్‌ దాందార్‌ - ఫిర్‌ ఏక్‌బార్‌ భాజపా సర్కార్‌ (నిజాయతీతో కూడిన ఆలోచన, ఘనమైన పనితీరు - మళ్లీ వచ్చేది భాజపా ప్రభుత్వమే)

ఎస్పీ: యూపీ కా హై జనాదేశ్‌, ఆ రహే హై అఖిలేశ్‌ ( యూపీ ప్రజల తీర్పు ఏంటంటే.. అఖిలేశ్‌ మళ్లీ అధికారంలోకి వస్తున్నారు)

బీఎస్పీ: సర్వ్‌ సమాజ్‌ కే సమ్మాన్‌ మే, బెహెన్‌ జీ మైదాన్‌ మే.. (అన్ని వర్గాల గౌరవం కోసం.. సోదరి(మాయవతి) బరిలో ఉన్నారు)

కాంగ్రెస్‌: లడ్‌కీ హూ.. లడ్‌ సక్తి హూ (నేను మహిళను.. పోరాడగలను)

పంజాబ్‌

పంజాబ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మధ్య విభేదాలు తలెత్తడంతో కెప్టెన్‌ అమీరందర్‌సింగ్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకొచ్చి.. ‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌’ పార్టీని స్థాపించారు. మరోవైపు సిద్దూ పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. కాగా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భాజపాతోపాటు, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కూడా గట్టి పోటీనిస్తోంది. ఈ సారి అధికారంలోకి వచ్చేది మేమేనని ఆప్ కన్వినర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వందేళ్ల చరిత్ర ఉన్న శిరోమణి అకాలీదళ్‌  కూడా తన బలాన్ని చాటుకునేందుకు సిద్ధమైంది. పంజాబ్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 117.

భాజపా: నవ పంజాబ్‌ - భాజపా దే నాల్‌ (కొత్త పంజాబ్‌.. భాజపా వెంటే ఉంది)

కాంగ్రెస్‌: 111 కాంగ్రెస్‌ దుబారా (మరోసారి 111 కాంగ్రెస్సే) - 1,100 రోజుల్లో గత సీఎం చేసిన పనుల్ని చన్నీ 111 రోజుల్లోనే చేశారంటూ కాంగ్రెస్‌ నేతలు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 111 రోజుల ముఖ్యమంత్రే మళ్లీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశం ప్రజల్లోకి వెళ్లేలా ఈ నినాదం ఇచ్చారు. అలాగే, ఘర్‌ ఘర్‌ చల్లీ గల్‌, చన్నీ కర్దా ముస్లే హల్‌(చన్నీ అన్ని సమస్యలను పరిష్కరించారని ప్రతి ఇంట్లోనూ చెప్పుకుంటున్నారు), లోకన్‌ దా సీఎం (ప్రజల ముఖ్యమంత్రి) అనే మరికొన్ని నినాదాల్ని కాంగ్రెస్‌ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. 

అకాలీదళ్‌: శిరోమణి అకాలీదళ్‌ పార్టీ ఏర్పడి 100ఏళ్లు పూర్తయింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఈ పార్టీకి బలమైన కేడర్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ చరిత్రను గుర్తు చేస్తూ నేతలు ‘100 సాల్‌ వికాస్‌ దే, విశ్వాస్‌ దే’(వందేళ్ల అభివృద్ధి.. విశ్వాసం) అనే నినాదాన్ని అందుకున్నారు.

ఆప్‌: పంజాబ్‌ ది ఉమ్మీద్‌ ఆప్‌( పంజాబ్‌కున్న ఏకైక ఆశ ఆప్‌) 

పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌: కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పార్టీకి ఎన్నికల సంఘం హాకీ స్టిక్‌, బాల్‌ గుర్తును కేటాయించింది. దీంతో ఆ పార్టీ నేతలు ‘బస్‌, గోల్‌ కర్నా బాకీ (చాలు, ఇక గోల్‌ కొట్టడమే మిగిలుంది)’ అంటూ నినదిస్తున్నారు.

గోవా

గోవా అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి ఆసక్తికరంగా మారాయి. ప్రతిసారి కాంగ్రెస్‌, భాజపా మధ్య పోటీ ఉండేది. ఈ సారి ఆప్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీలు కూడా గోవా ఎన్నికల బరిలో దిగుతున్నాయి. గోవాలో ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్య 40.

భాజపా: అన్ని రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గోవాలో భాజపా నేతలు డబుల్‌ ఇంజిన్‌ గవర్నమెంట్‌(రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ రెండు ఇంజన్ల ప్రభుత్వం) అనే నినాదాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఈ నినాదం వివాదస్పదంగా మారింది. ఆ నినాదం వల్ల భాజపాలో నియంతృత్వ ధోరణి కనిపిస్తోందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. 

టీఎంసీ: గోవాలో రసవత్తరంగా జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ‘ఖేల్‌ జాట్లో (ఆట జరుగుతుంది)’అని నినాదమిచ్చారు.

ఆప్‌: ఏక్‌ ఛాన్స్‌ కేజ్రీవాలక్‌(కేజ్రీవాల్‌ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి) 

మణిపూర్‌

మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న భాజపా అన్నిస్థానాల్లో పోటీ చేయనుంది. యూపీఏ(కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ) కూటమిపాటు, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఇక్కడ భాజపా.. ‘ట్రాన్స్‌ఫార్మింగ్‌ మణిపూర్‌ అండర్‌ ఎన్డీయే (ఎన్డీయే ప్రభుత్వం హయాంలో మణిపూర్‌ మారిపోతుంది), ఇస్‌ బార్‌.. 40 పార్‌ (ఈసారి 40 దాటాలి)వంటి నినాదాలతో దూసుకెళ్తోంది. 

ఉత్తరాఖండ్‌

ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుతం భాజపా అధికారంలో ఉంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. మరోసారి సీఎంగా పుష్కర్‌సింగ్‌ ధామీనే ఉంటారని భాజపా ప్రకటించింది. 

భాజపా: ‘ధామీ మే హై దమ్‌.. మోదీజీ హై సంగ్‌(ధామిలో దమ్ము ఉంది. మోదీ తోడుగా ఉన్నారు)’

కాంగ్రెస్‌: ఐదేళ్లలో భాజపా ప్రభుత్వం ముగ్గురు సీఎంలను మార్చడాన్ని ఎద్దేవా చేస్తూ ఓ పాటను రూపొందించింది. ‘తీన్‌ తిగడ కామ్‌ మిగడా.. ఉత్తరాఖండ్‌ మే నహీ ఆయేగి అప్‌ భాజపా దోబారా (ముగ్గురు పని చెడగొట్టారు.. ఉత్తరాఖండ్‌లో భాజపా మళ్లీ అధికారంలోకి రాదు)’అంటూ సాగే ఈ పాటను ఎన్నికల ప్రచారంలో వాడుకోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని