‘పంచ’తంత్రంలో గెలుపు మంత్రమెవరిది?

దేశంలో కొద్ది రోజుల్లో ప్రవేశించబోయే వేసవి సీజన్‌కు రాజకీయ వేడి జత కానుంది. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున రాజకీయ చర్చకు దారితీసే ఎన్నికల ప్రక్రియకు తెరలేచింది. నాలుగ....

Published : 27 Feb 2021 01:08 IST

సత్తా చాటేందుకు భాజపా కృషి

పట్టు నిలుపుకొనేందుకు విపక్షాల ప్రయత్నం

ఐదేళ్లలో మారిన రాజకీయ ముఖచిత్రం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: దేశంలో కొద్ది రోజుల్లో ప్రవేశించబోయే వేసవి సీజన్‌కు రాజకీయ వేడి జత కానుంది. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున రాజకీయ చర్చకు దారితీసే ఎన్నికల ప్రక్రియకు తెరలేచింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగింది. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల సహా పుదుచ్చేరిలో ఎన్నికలతో దేశంలో మరో మినీ సంగ్రామం జరగనుంది. ప్రస్తుతం కేంద్రంలోనూ, అటు చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భాజపాకు ఈ ఐదింటిలో కేవలం అసోంలో మాత్రమే గతంలో అధికారం దఖలు పడింది. దీంతో మిగిలిన నాలుగు చోట్లా సత్తా చాటేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీలు తమ పట్టు నిలుపుకొనేందుకు ప్రయత్నిస్తుండగా.. పూర్వవైభవాన్ని సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ తహతహలాడుతోంది. ఐదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ రాష్ట్రాల్లో గత ఎన్నికల ముఖచిత్రమేంటి? ప్రస్తుత పరిస్థితులేంటి? ఈ ఐదేళ్లలో జరిగిన మార్పులేంటో ఇప్పుడు చూద్దాం..

దీదీ, జయలలిత ‘డబుల్‌’ (2016 ఎన్నికలు)

అసోం (126): ఈశాన్య రాష్ట్రమైన అసోంలో తొలిసారి భాజపా గత ఎన్నికల్లో సత్తా చాటింది. మొత్తం 126 సీట్లకు గానూ 89 చోట్ల పోటీ చేసి 60 సీట్లు సాధించింది. ఏజీపీ, బీపీఎఫ్‌ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ కేవలం 26 సీట్లకు పరిమితమై అధికారాన్ని కోల్పోయింది.

పశ్చిమబెంగాల్‌ (294): 2016 ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పశ్చిమ బెంగాల్‌లో రెండోసారి అధికారంలోకి వచ్చింది. సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న వామపక్షాలను మట్టికరిపించి అధికారంలోకి వచ్చిన టీఎంసీ రెండోసారి మరో 27 సీట్లు అదనంగా గెలుచుకుని 211 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్‌- వామపక్ష కూటమి 77 సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో భాజపా మూడు, జీజేఎం మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

తమిళనాడు (234): జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకే 2016లో రెండోసారి అధికారంలోకి వచ్చింది. 136 స్థానాల్లో గెలుపొందిన జయలలిత రెండోసారి సీఎం పీఠం దక్కించుకున్నారు. డీఎంకే 89 సీట్లు గెలుచుకోగా... కాంగ్రెస్‌ పార్టీ 8 స్థానాలకు పరిమితమైంది.

కేరళ (140): గత ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం 91 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 47 స్థానాలతో సరిపెట్టుకుంది. కేవలం ఒకే ఒక్క స్థానంలో భాజపా గెలుపొందింది.

పుదుచ్చేరి (30): కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాలకు గానూ కాంగ్రెస్‌, డీఎంకే కలిసి 17 స్థానాలతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎన్నార్‌ కాంగ్రెస్‌కు ఏడుగురు, అన్నాడీఎంకేకు నలుగురు శాసభ్యులు ఉన్నారు. భాజపా తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు నామినేట్‌ అయ్యారు.

లెక్క మారింది..

గత ఐదేళ్లలో ఈ ఐదు చోట్ల ఎన్నికల ముఖచిత్రంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తృణమూల్‌కు ఈ సారి భాజపా సవాల్‌ విసురుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు ఊపుతో అధికారమే లక్ష్యంగా పనిచేస్తోంది. అక్కడ కాంగ్రెస్‌-వామపక్ష కూటమి  ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. 

మరోవైపు జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజ నేతల మరణాలతో తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడింది. కమల్‌ ఇప్పటికే పార్టీని స్థాపించినప్పటికీ ప్రభావం అంతంతే. ఇక రజనీ రాజకీయ ప్రవేశానికి ముందే రిటైర్డ్‌ హర్ట్‌ అయ్యారు. దీంతో పాత యుద్ధమే రీస్టార్ట్‌ కానుంది. స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే కాంగ్రెస్‌తో కలిసి అధికారం దిశగా అడుగులు వేస్తోంది. అన్నాడీఎంకే- భాజపా కూటమికి సవాల్‌ విసురుతోంది.

ఇక కేరళలో పూర్వవైభవానికి కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తోంది. అయితే, క్యాడర్‌ను నమ్ముకున్న భాజపా సైతం తనవంతు కృషి చేస్తోంది. ఇటీవల స్థానిక ఎన్నికల్లో గెలుపు ఇచ్చిన ధైర్యంతో ఎల్డీఎఫ్‌ ధీమాతో ఉంది. పుదుచ్చేరిలో ఇటీవలే నారాయణస్వామి ప్రభుత్వం కూలిపోవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యేల ద్వారా అసెంబ్లీలో ప్రవేశించిన భాజపా.. ఈ సారి అధికారమే లక్ష్యంగా పనిచేస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలను పార్టీలో చేర్చుకుంది.

అన్ని పార్టీలకూ కీలకమే

* కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. ముఖ్యంగా అసోంలో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు.. పశ్చిమ బెంగాల్‌లో రాణించడం ఆ పార్టీకి ముఖ్యం. ఒకవేళ ఈ రెండు చోట్లా ఓడితే కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత అనే ముద్ర పడుతుంది.

* ప్రస్తుతం ఒకే ఒక్క రాష్ట్రానికి పరిమితమైన సీపీఎంకు కేరళ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఇప్పటికే బెంగాల్‌, త్రిపురలో అధికారానికి దూరమై ప్రాభవం కోల్పోయిన ఆ పార్టీకి ఈ ఎన్నికలు సవాల్‌తో కూడుకున్నవే. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీకి కొంత ఊరటనిస్తున్నాయి.

* ఇప్పుడు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నదే. అయితే, పశ్చిమబెంగాల్‌, తమిళనాడులో ఆ పార్టీ బలం దారుణంగా పడిపోయింది. ఇక కేరళలో లెఫ్ట్‌ను ఓడించడం కొద్దిగా కష్టంతో కూడుకున్న వ్యవహారమే. ఇక అసోంలో సీఏఏ, పుదుచ్చేరిలో సానుభూతితో అధికారంలోకి రావాలని చూస్తోంది. 

* రెండేసి సార్లు అధికారంలోకి వచ్చిన తృణమూల్‌, ఏఐఏడీఎంకే ప్రభుత్వ వ్యతిరేకతను దాటుకుని మళ్లీ అధికారం చేపట్టడం అంత సులువేమీ కాదని అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మే2 వరకు వేచి చూడాల్సిందే!!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని