ఏపీలో కొనసాగుతున్న పోలింగ్‌

రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్‌  మంగళవారం ఉదయం ప్రారంభమైంది. సర్పంచి స్థానాలకు 7,506 మంది పోటీ చేస్తున్నారు. ..

Updated : 09 Feb 2021 12:30 IST

అమరావతి: రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్‌  మంగళవారం ఉదయం ప్రారంభమైంది. సర్పంచి స్థానాలకు 7,506 మంది పోటీ చేస్తున్నారు. 20,157 వార్డు సభ్యుల స్థానాలకు 43,601 మంది బరిలో ఉన్నారు. పోలింగ్‌కు 88,523 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. నోటిఫికేషన్‌ ఇచ్చిన 3,249 గ్రామ పంచాయతీల్లో 525 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో నిలిపివేసిన ఏకగ్రీవాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సోమవారం సాయంత్రం తిరిగి అనుమతించారు. 

29,732 పోలింగ్‌ కేంద్రాలు
ఎన్నికలకు 29,732 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 3,458 సమస్యాత్మకం, మరో 3,594 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 18,608 బ్యాలెట్‌ పెట్టెల్లో 8,503 మధ్య రకం, మరో 21,338 చిన్న పెట్టెలు ఉన్నాయి. పోలింగ్‌ సందర్భంగా 1,130 మంది ఎన్నికల అధికారులు, మరో 3,249 మంది స్టేజ్‌-2 అధికారులు, 1,432 మంది సహాయ ఎన్నికల అధికారులు, 33,533 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 44,392 మంది సిబ్బంది సేవలు వినియోగించనున్నారు. 519 మంది జోనల్‌ అధికారులు, పోలింగ్‌ సరళి పరిశీలించేందుకు 1,221 మంది పర్యవేక్షకులు, 3,047 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు.

కరోనా సోకిన వారికి ప్రత్యేకంగా..
 కరోనా సోకిన వారు మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు, ఏజెన్సీ ప్రాంతాల్లో 12.30 నుంచి 1.30 గంటల వరకు ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. సాధారణ ఓటర్లను థర్మల్‌ స్కానింగ్‌ చేసి సాధారణం కంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే వారిని వెనక్కి పంపి చివరి గంటలో అనుమతిస్తారు. పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బందికి మాస్క్‌లు, చేతి తొడుగులు, శానిటైజర్‌ సిద్ధం చేశారు. కరోనా సోకిన వారు ఓటింగ్‌కి ఎక్కువ మంది వస్తే ఆ కేంద్రాల్లో సిబ్బందికి పీపీఈ కిట్లు సమకూర్చుతారు. ఓట్ల లెక్కింపు కోసం 14,535 మంది పర్యవేక్షకులు, మరో 37,750 మంది సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు ప్రత్యక్ష పరిశీలనకు తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, పోలింగ్‌ కేంద్రాల్లో పరిస్థితులను తెలుసుకోవడానికి వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాట్లు చేశారు.

ఇవీ చదవండి..

రోడ్డెక్కిన వాలంటీర్లు

మాచర్ల, పుంగనూరులలో రీనోటిఫికేషన్‌ ఇవ్వాలి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని