Telangana News: దోపిడీ చేసి జాతీయ పార్టీ పెడతానంటే దేవుడు వరమిస్తాడా?: పొన్నాల

సీఎం కేసీఆర్‌ చేసినంత దోపిడీ దేశంలో ఎవరూ చేయలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. దోపిడీ చేసి జాతీయ పార్టీ పెడతానంటే దేవుడు వరం ఇస్తాడా? అని ఎద్దేవా చేశారు. 

Published : 30 Sep 2022 17:57 IST

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. పాపాల పరిహారం కోసమే కేసీఆర్‌ యాదాద్రికి కానుకలు ఇస్తున్నారని మండిపడ్డారు. సీఎం తీరు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్లు ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ చేసినంత దోపిడీ దేశంలో ఎవరూ చేయలేదని ఆరోపించారు. దోపిడీ చేసి జాతీయ పార్టీ పెడతానంటే దేవుడు వరం ఇస్తాడా? అని ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీ పేరుతో సొంత విమానం కొనడం కేసీఆర్ దోపిడీకి నిదర్శనమని విమర్శించారు.

కేసీఆర్‌ పాలనలో దేవాదుల ప్రాజెక్టులో మూడో మోటారు ఎందుకు నడపలేదని ప్రశ్నించారు. వరంగల్‌లో అండ్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ గురించి మాట్లాడిన కేసీఆర్‌.. ఇప్పటివరకు ఒక్క పైసా ఎందుకు ఖర్చు చేయలేదని నిలదీశారు. వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు ఒక్క పైసా మంజూరు చేయలేదన్నారు. టెక్ట్స్‌టైల్‌ పార్కు హామీ ఎటుపోయిందో అర్థం కావట్లేదని చెప్పారు. వరంగల్‌లోని మురికివాడల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం హామీ ఏమైంది?.. కొద్దో గొప్పో కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. భద్రకాళి దేవాలయం వద్ద ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. వరంగల్ పర్యటనలో జిల్లా ప్రజలకు వీటిపై కేసీఆర్‌ సమాధానం చెప్పాలని పొన్నాల డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని