Prashant Kishor: ‘అలాగైతే.. విపక్షాల ఐక్యత పని చేయదు..!’

వచ్చే సాధారణ ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత పనిచేయదని ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు. భారత్‌ జోడో యాత్ర ఫలితాలు క్షేత్రస్థాయిలో తేలుతాయని చెప్పారు.

Published : 21 Mar 2023 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో భాజపా(BJP) ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఆయా పార్టీలు పొత్తుల దిశగా అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, 2024లో భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యత(Opposition Unity) పనిచేయదని ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్‌ కిశోర్‌(Prashant Kishor) జోస్యం చెప్పారు. సైద్ధాంతిక వైరుధ్యాలతో అది అస్థిరంగా ఉంటుందని పేర్కొన్నారు. కేవలం పార్టీలను లేదా, నేతలను ఏకతాటిపైకి తీసుకురావడం వల్ల విపక్షాల ఐక్యత సాధ్యం కాదని స్పష్టం చేశారు. ‘హిందుత్వం, జాతీయవాదం, సంక్షేమం.. ఈ మూడు భాజపా మూల స్తంభాలు. ఈ మూడింటిలో కనీసం రెండింటిని ఎదుర్కోలేకపోతే.. కషాయ దళాన్ని సవాల్‌ చేయలేరు’ అని ఓ జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పీకే’ పేర్కొన్నారు.

‘భాజపా హిందూత్వ భావజాలంపై పైచేయి సాధించాలంటే.. గాంధేయులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు, అంబేడ్కర్‌వాదులు ఇలా అన్ని భావజాలాల నేతలు కలిసి రావాలి. అంతవరకు భాజపాను ఓడించే అవకాశం లేదు. అయితే, కేవలం భావజాలాన్నే గుడ్డిగా నమ్ముకోకూడదు’ అని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పారు. కాంగ్రెస్‌తో విభేదాలపై స్పందిస్తూ.. ‘నా లక్ష్యం.. కాంగ్రెస్ పునరుజ్జీవం. వారి లక్ష్యం.. ఎన్నికల్లో గెలవడమే. వారు కోరుకున్న మార్గంలో నా ఆలోచనలను అమలు చేయడానికి అంగీకరించలేదు’ అని తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విషయానికొస్తే.. ఆయన దేశవ్యాప్త పాదయాత్ర ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది క్షేత్రస్థాయిలోనే తేలుతుందన్నారు. ‘ఆరు నెలల భారత్ జోడో యాత్రలో ప్రశంసలు, విమర్శలు కూడా వచ్చాయి. పార్టీ అదృష్టాన్ని మెరుగుపరిచేందుకు చేపట్టిన ఈ సుదీర్ఘ పాదయాత్ర అనంతరం జరిగే ఎన్నికల్లో కొంత తేడా కనిపించాలి’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని