
బెంగాల్లో BJP.. పీకే చెప్పిందే నిజమైందా?
వైరల్ అవుతున్న డిసెంబరు నాటి ట్వీట్
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ హ్యాట్రిక్ విజయం వైపు దూసుకెళ్తోంది. తాజాగా వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆ పార్టీ 200కు పైగా స్థానాల్లో ముందంజలో ఉండగా.. భాజపా రెండో స్థానానికి పరిమితమైంది. అయితే ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గతంలో చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. బెంగాల్ ఎన్నికల్లో భాజపా రెండంకెలు కూడా దాటలేదని పీకే జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తుంటే అదే నిజమవుతున్నట్లు అన్పిస్తోంది.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పీకే.. అధికార తృణమూల్ కాంగ్రెస్కు వ్యూహకర్తగా పనిచేశారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు భాజపా నేతలు, ప్రశాంత్ కిశోర్ మధ్య ట్విటర్ వేదికగా మాటలయుద్ధం నెలకొంది. దాంతో కాషాయ పార్టీకి కౌంటర్ ఇస్తూ గతేడాది డిసెంబరు 21న పీకే ఓ ట్వీట్ చేశారు. ‘‘వాస్తవానికి పశ్చిమ బెంగాల్లో భాజపా రెండంకెల కంటే మించి సీట్లు సాధించలేదు. అంతకంటే ఎక్కువ సీట్లు వస్తే నేను ట్విటర్ను శాశ్వతంగా వీడుతా’’ అని ఆయన సవాల్ విసిరారు.
ఇప్పటివరకు వెలువడుతున్న ఫలితాల ప్రకారం.. భాజపా 2 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 85 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక అధికార టీఎంసీ 10 స్థానాల్లో గెలుపొంది 191 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. దీంతో నాడు పీకే చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.