Rahul Gandhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి..! తెలంగాణలో భాజపాపై రాహుల్‌ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావొచ్చని పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లకు జనగణన, డీలిమిటేషన్‌లతో సంబంధం లేదన్నారు.

Published : 24 Sep 2023 16:04 IST

దిల్లీ: రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) మంచి ఫలితాలు సాధిస్తుందని పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. తెలంగాణలోనూ అధికారంలోకి రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో పార్టీ విజయం ఖాయమని, రాజస్థాన్‌లో చాలా దగ్గరి పోటీ ఉందని, అయినప్పటికీ గెలుపొందుతామన్నారు. ఓ వార్తాసంస్థ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ ఈ మేరకు మాట్లాడారు. తెలంగాణలో భాజపా (BJP) క్షీణించిందని.. అక్కడ ఆ పార్టీ పనైపోయిందని వ్యాఖ్యానించారు. మరికొన్ని నెలల్లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

కుల గణనకు భయమెందుకు?: రాహుల్‌ గాంధీ

‘దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు, రమేశ్‌ బిధూరి వ్యవహారం వంటివాటిని భాజపా తెరపైకి తెస్తోంది. అదానీ వ్యవహారంపై వచ్చిన మీడియా కథనాల నుంచి దృష్టి మళ్లించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. కుల గణన డిమాండ్ నుంచి తప్పించుకునేందుకు లోక్‌సభలో భాజపా ఎంపీ రమేశ్‌ బిధూరి వ్యవహారాన్ని తీసుకొచ్చింది. అయితే.. ఈ తరహా వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాం. కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేశాం’ అని రాహుల్‌ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లకు జనగణన, డీలిమిటేషన్‌లతో సంబంధం లేదని.. రేపు ఉదయాన్నే ఈ రిజర్వేషన్లను అమలు చేయొచ్చన్నారు.

2024లో ఆశ్చర్యకర ఫలితాలు..

ప్రస్తుతం విపక్షాలన్నీ కలిసికట్టుగా పని చేస్తున్నాయని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఆశ్చర్యానికి గురవుతుందని రాహుల్‌ గాంధీ అన్నారు. భారత్‌ జోడో యాత్ర నుంచి నేర్చుకున్న విషయాల గురించి మాట్లాడుతూ.. ‘భారత్‌లో ప్రసార మాధ్యమాలపై భాజపా పట్టుసాధించింది. ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా వక్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ చూపిన బాటలో.. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యాను. ఈ పాత విధానం నేటికీ పనిచేస్తుందని తెలుసుకున్నా’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు