పుదుచ్చేరి ‘పరీక్ష’.. నారాయణస్వామి గట్టెక్కేనా?

ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో సంక్షోభంలో కూరుకుపోయిన పుదుచ్చేరి కాంగ్రెస్‌ ప్రభుత్వం నేడు బలపరీక్షను ఎదుర్కోనుంది. కానీ, ఈ పరీక్షలో సీఎం నారాయణ స్వామి గెలిచే అవకాశాలు దాదాపు సన్నగిల్లినట్లే

Updated : 22 Feb 2021 10:10 IST

పుదుచ్చేరి: ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో సంక్షోభంలో కూరుకుపోయిన పుదుచ్చేరి కాంగ్రెస్‌ ప్రభుత్వం నేడు బలపరీక్షను ఎదుర్కోనుంది. కానీ, ఈ పరీక్షలో సీఎం నారాయణ స్వామి గెలిచే అవకాశాలు దాదాపు సన్నగిల్లినట్లే కన్పిస్తున్నాయి. విశ్వాస పరీక్షకు ఒక రోజు ముందు అధికార పార్టీ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వైదొలగడంతో కాంగ్రెస్‌ సర్కార్‌ మరింత మైనార్టీలో పడింది. 

ఎమ్మెల్యేల రాజీనామాతో పుదుచ్చేరి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే అనూహ్యంగా కిరణ్‌బేడీని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవి నుంచి తప్పించి.. తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎల్జీగా బాధ్యతలు స్వీకరించిన తమిళసై.. నారాయణస్వామి ప్రభుత్వం సోమవారం సాయంత్రంలోగా అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించారు. 

ముగ్గురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు సహా 33 మంది సభ్యులున్న పుదుచ్చేరి శాసనసభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాల అనంతరం 26 మంది ఉన్నారు. నారాయణస్వామి ప్రభుత్వం గట్టెక్కాలంటే 14 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ అధికార కాంగ్రెస్‌ కూటమి బలం 12కి తగ్గింది. ఇందులో కాంగ్రెస్‌ నుంచి 10(స్పీకర్‌తో కలిపి), డీఎంకే నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. మరోవైపు విపక్ష పార్టీ అయిన ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూటమి బలం 14(ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్‌ భాజపా ఎమ్మెల్యేలు ముగ్గురు)గా ఉంది. దీంతో బలపరీక్షలో కాంగ్రెస్‌ నెగ్గే అవకాశాలు దాదాపు కన్పించట్లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని