Punjab polls: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీ ఇదే

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. అధికార కాంగ్రెస్‌తో పాటు పలు రాజకీయ పార్టీల విజ్ఞాపన మేరకు గతంలో......

Updated : 17 Jan 2022 15:07 IST

దిల్లీ: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు గతంలో ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఫిబ్రవరి 14న ఒకే విడతలో జరగాల్సిన పోలింగ్‌ను ఆరు రోజుల పాటు వాయిదా వేసింది. తాజాగా ఈ ఎన్నికలను ఫిబ్రవరి 20న నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు గురు రవిదాస్‌ జయంతి వేడుకలు ఉండటంతో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీని మార్చాలని అధికార కాంగ్రెస్‌ సహా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. అయితే, ఈసీ ఇటీవల ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం.. పంజాబ్‌లో ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్‌ జరగాల్సి ఉంది. కానీ, ఫిబ్రవరి 16న యూపీలోని బెనారస్‌లో గురు రవిదాస్‌ జయంతి ఉత్సవాలు ఉన్నాయి. దానికి సంబంధించిన కార్యక్రమాలు ముందే ప్రారంభమవుతాయి. పైగా, జయంతి నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి తరలి వెళ్లనున్నారు.. దీంతో వారంతా ఓటు వేసే అవకాశం కోల్పోతారని పార్టీలు ఈసీకి విన్నవించాయి. ఈ నేపథ్యంలో పోలింగ్‌ తేదీని వారం పాటు వాయిదా వేయాలని స్వయంగా పంజాబ్‌ సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ విజ్ఞప్తి చేశారు. ప్రధాన పార్టీలైన బీఎస్పీ, భాజపా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో సమావేశమైన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పోలింగ్‌ తేదీని ఫిబ్రవరి 20కి మార్పు చేస్తూ కొత్త షెడ్యూల్‌ని ప్రకటించింది.

కొత్త షెడ్యూల్‌ ఇదే..

* జనవరి 25న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

* నామినేషన్లకు తుది గడువు: ఫిబ్రవరి 1

* నామినేషన్ల పరిశీలనకు తుది గడువు: ఫిబ్రవరి 2

* నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు: ఫిబ్రవరి 4

* ఎన్నికల పోలింగ్‌: ఫిబ్రవరి 20

* ఓట్ల లెక్కింపు: మార్చి 10

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని