Telangana News: సీనియర్లైనా సరే.. పనిచేయని వారికి టికెట్‌ దక్కదు: రాహుల్‌గాంధీ

వచ్చే ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్‌ మధ్య యుద్ధం ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెనక ధనం, పోలీసులు ఉన్నప్పటికీ

Updated : 07 May 2022 15:35 IST

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్‌ మధ్య యుద్ధం ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెనక ధనం, పోలీసులు ఉన్నప్పటికీ ప్రజలు లేరన్నారు. తెలంగాణను ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్‌ నేతలకు పిలుపునిచ్చారు. నేతల కృషి వల్ల వరంగల్‌ సభ దిగ్విజయం అయిందని.. ఇందుకోసం ప్రతి ఒక్కరికీ రాహుల్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. గాంధీభవన్‌లో జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ నేతలను ఉద్దేశించి రాహుల్‌ మాట్లాడారు.

‘‘కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసేది నిరంకుశ ప్రభుత్వం కాదు. మెరిట్‌ ఆధారంగా వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇస్తాం. ప్రజలు, రైతుల పక్షాన పోరాటం చేసే వారికే టికెట్‌ ఇస్తాం. ఎంతటి సీనియర్లు అయినా సరే.. పార్టీ కోసం పనిచేయని వారికి టికెట్‌ మాత్రం దక్కదు. హైదరాబాద్‌లో కూర్చుంటే, దిల్లీ చుట్టూ తిరిగితే టికెట్లు రావు. టికెట్‌ దక్కాలంటే హైదరాబాద్‌ను వదిలి గ్రామాల్లోకి వెళ్లాలి. వెనుక డోర్‌ ద్వారా ప్రయత్నించే వారు ఆశలు వదులుకోవాలి. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి గురించి సర్వే చేసి టికెట్లు కేటాయిస్తాం. వరంగల్‌ డిక్లరేషన్‌ గురించి ప్రతి వ్యక్తికి, ప్రతి రైతుకు వివరించాలి. వరంగల్‌ డిక్లరేషన్‌ గురించి చిన్న పిల్లలకు కూడా తెలియాలి. వరంగల్‌లో చెప్పింది డిక్లరేషన్‌ మాత్రమే కాదు.. ప్రజలు, కాంగ్రెస్‌ ప్రభుత్వం మధ్య ఉన్న ఒప్పందం.

కుటుంబంలోని వ్యక్తుల మధ్య అభిప్రాయభేదాలు ఉండటం సహజం. నేను ప్రతి ఒక్కరి అభిప్రాయాలు, ఆలోచనలు వింటాను. ఏదైనా చెప్పాలంటే నాకు చెప్పాలి... మీడియా ముందు మాత్రం చెప్పొద్దు. ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకుందాం కానీ.. మీడియా ముందు మాత్రం వద్దు. కాంగ్రెస్‌పై గౌరవం ఉన్న కార్యకర్తలు కోట్ల మంది ఉన్నారు. రాష్ట్రంలో 8 ఏళ్లుగా అరాచక పాలన కొనసాగుతోంది. రాష్ట్ర సంపదంతా ఒక కుటుంబం దోచుకుంటోంది. ఎన్నో ఆశయాలతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. ఇన్నేళ్లలో ప్రజలు, సోనియా గాంధీ అనుకున్నది రాష్ట్రంలో జరగలేదు. తెలంగాణలో విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రజలకు న్యాయం జరగడం లేదు. కేసీఆర్‌ కుటుంబం నుంచి తెలంగాణకు రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. నిరంకుశ కేసీఆర్‌ను తరిమికొట్టాలి. తెరాసకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో యువత కదిలిరావాలి. మన ఆకాంక్షలు నెరవేరాలంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ గెలవాలి’’ అని రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని