Raghunandan Rao: పేపర్‌ లీకేజీతో సంబంధం లేకుంటే కేటీఆర్‌ ఎందుకు స్పందించారు?: రఘునందన్‌

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆరే బాధ్యత వహించాలని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌ రావు డిమాండ్‌ చేశారు.  రాష్ట్రంలో ఏ కంప్యూటర్ హ్యాక్‌ అయినా ఐటీ శాఖ మంత్రే నైతిక బాధ్యత వహించాలన్నారు. 

Updated : 25 Mar 2023 14:23 IST

హైదరాబాద్‌: ఎన్నికల నామ సంవత్సరం కాబట్టే.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతన్నలపై ప్రేమ చూపిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేటీఆరే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నీతి వాక్యాలు చెప్పే కేటీఆర్.. లాల్ బహదూర్ శాస్త్రిని ఎందుకు ఆదర్శంగా తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ కంప్యూటర్ హ్యాక్‌ అయినా ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆరే నైతిక బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

తండ్రి మాదిరి.. కుమారుడికి కూడా జర్నలిస్టులను తిట్టడం అలవాటుగా మారిందని రఘునందన్‌ దుయ్యబట్టారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీతో సంబంధం లేకుంటే ఆ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి మాట్లాడకుండా కేటీఆర్ ఎందుకు స్పందించారని ప్రశ్నించారు. రాజు తర్వాత యువరాజుగా ఫీల్ అవుతున్నాడు కాబట్టే.. కేటీఆర్‌ను రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. నిండు సభలో కౌలు లేదు.. కౌలు రైతు లేడన్న కేసీఆర్‌కు ఎన్నికలు రాగానే కౌలు రైతులు గుర్తొచ్చారా? అని ప్రశ్నించారు. అటెన్షన్ డైవర్షన్ స్కీంలో భాగమే కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్నారని రఘునందన్‌ విమర్శించారు. నిజంగా రైతులను ప్రభుత్వం ఆదుకుంటామంటే భాజపా స్వాగతిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కౌలు రైతుల‌ సంఖ్య ఎంతో వ్యవసాయశాఖ కమిషనర్ శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరు ఎకరాలు దాటిన రైతులకు ఈ ఏడాది రైతుబంధు రాలేదని రఘునందన్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని