AP News: ‘నా హత్యకు కుట్ర జరుగుతోంది’: రఘురామకృష్ణరాజు

జార్ఖండ్‌కు చెందిన వ్యక్తులతో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు.

Updated : 15 Jan 2022 06:09 IST

దిల్లీ: జార్ఖండ్‌కు చెందిన వ్యక్తులతో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... దీనిపై అన్ని వివరాలతో ప్రధానమంత్రికి లేఖ రాయనున్నట్టు చెప్పారు. ‘‘గుంటూరు జిల్లాలో తెదేపా నేతను దారుణంగా హత్య చేశారు. సీఎం జగన్‌కు రాష్ట్రంలో వ్యవస్థ నచ్చకపోతే వ్యవస్థను, వ్యక్తి నచ్చకపోతే వ్యక్తిని తీసేస్తారు. ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌పై నేను ఇచ్చిన ప్రివిలేజ్‌ పిటిషన్ పై బండి సంజయ్‌ వ్యవహారంలో స్పందించినంత వేగంగా  స్పందించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. జగనన్న గోరుముద్ద పథకం ఇకపై రాష్ట్రంలో కొనసాగదు. ఈ విషయమై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ నేను రాసిన లేఖకు స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక రాష్ట్రంలో జగనన్న పథకాలను కొనసాగించలేరు. పోలీసు వ్యవస్థను ప్రతిపక్ష నేతలను వేధించేందుకు, కేసులు పెట్టేందుకే వినియోగిస్తున్నారు. చిరంజీవిని అల్లరి చేయించడానికి ఆయనకు రాజ్యసభ అవకాశం ఇస్తున్నట్టు  ఓ పత్రికలో కథనం రాయించారు. పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే పని అన్నయ్యగా చిరంజీవి చెయ్యరు. చిరంజీవి చెప్పకపోతే ముఖ్యమంత్రికి సినిమా కష్టాలు తెలియవా? ప్రభుత్వంపై పోరాడుతున్న పవన్‌ కల్యాణ్ కు చిరంజీవి మద్దతు ఇవ్వాలి. ఇకపై సీఎం విందుకు చిరంజీవి వెళ్లాల్సిన అవసరం లేదు. సీఎం అయినంత మాత్రాన 3 రూపాయలకు సినిమా చూపిస్తాను అంటే కుదరదు. సినిమా రంగానికి అన్యాయం చేస్తే న్యాయం చేయడానికి కోర్టులు ఉన్నాయి’’ అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని