Rahul Gandhi: గుజరాత్లో రాహుల్ తొలి ప్రచారం.. భాజపాపై గరంగరం
భారత్ జోడో యాత్ర నుంచి విరామం తీసుకున్న రాహుల్ నేడు సూరత్ జిల్లాలోని మహువా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భాజపాపై విమర్శలు గుప్పించారు.
మహువా: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార జోరు పెంచాయి. గత కొన్ని రోజులుగా భారత్ జోడో యాత్రలో బిజీబిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం తొలిసారిగా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార భాజపాపై ఘాటు విమర్శలు చేశారు. భాజపా ఆదివాసీల నుంచి భూములను లాక్కొని పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలని ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.
భారత్ జోడో యాత్ర నుంచి విరామం తీసుకున్న రాహుల్ నేడు సూరత్ జిల్లాలోని మహువా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదివాసీలే ఈ దేశానికి తొలి యజమానులు . కానీ భాజపా వారిని ‘వనవాసులు’గా పిలుస్తోంది. మీరు నగరాల్లో ఉండాలని, మీ పిల్లలు బాగా చదువుకుని డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని ఆ పార్టీ కోరుకోవట్లేదు. ఈ అడవుల్లోనే అణగారిపోవాలని అనుకుంటోంది. అది అక్కడితో ఆగిపోదు. ఆ తర్వాత మీ అడవులను కూడా వారు లాగేసుకుంటారు. భాజపా ఇలాగే అధికారంలో కొనసాగిస్తే వచ్చే 5-10 ఏళ్లలో అడవులన్నీ ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్లిపోతాయి. అప్పుడు మీకు ఉండటానికి చోటు కూడా మిగలదు’’ అంటూ భాజపాపై విరుచుకుపడ్డారు.
ఈ దేశ ప్రజలను ఐక్యం చేసేందుకే తాను భారత్ జోడో యాత్ర చేపట్టానని రాహుల్ తెలిపారు. యాత్రలో భాగంగా తాను ఎంతోమంది రైతులు, యువత, ఆదివాసీ తెగ ప్రజలను కలిసి వారి బాధలను తెలుసుకున్నానని చెప్పారు. గుజరాత్ పర్యటనలో భాగంగా రాహుల్ నేడు రాజ్కోట్లోనూ ప్రచారం చేపట్టనున్నారు.
అటు భాజపా కూడా ముమ్మర ప్రచారం చేస్తోంది. తన స్వరాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఒకేరోజు మూడు ర్యాలీల్లో పాల్గొన్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా నేడు రాష్ట్రంలో పర్యటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.