
Lakhimpur Kheri Incident: ఎట్టకేలకు లఖింపుర్ ఖేరి చేరుకున్న రాహుల్, ప్రియాంక
లఖ్నవూ: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా నిర్బంధాల మధ్య ఎట్టకేలకు యూపీలోని లఖింపుర్ ఖేరి చేరుకున్నారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడి కారు దూసుకెళ్లిన ఘటనలో మృతిచెందిన రైతుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. తొలుత 19 ఏళ్ల లవ్ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. లఖింపుర్ ఖేరికి రాహుల్ వెళ్లకుండా ఈ రోజు ఉదయం లఖ్నవూ విమానాశ్రయం వద్ద ఆయన్ను యూపీ పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. చివరకు పోలీసులు వెనక్కి తగ్గి ఐదుగురికి మాత్రమే అవకాశం కల్పించడంతో లఖ్నవూ నుంచి మధ్యాహ్నం బయల్దేరిన రాహుల్ గాంధీ.. తొలుత సీతాపూర్ చేరుకున్నారు. అక్కడ గెస్ట్ హౌస్లో నిర్బంధంలో ఉన్న తన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వద్దకు చేరుకున్నారు. రాహుల్ కాన్వాయ్ని పోలీసులు అడ్డుకోవడంతో సీతాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆమెను అధికారులు నిర్బంధం నుంచి విడుదల చేయడంతో ఇద్దరూ కలిసి కొద్దిసేపటి క్రితమే లఖింపుర్ ఖేరికి చేరుకున్నారు. వీరి వెంట పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్తో పాటు కాంగ్రెస్ నేతలు రణ్దీప్ సింగ్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్, దీపీందర్ సింగ్ హుడా ఉన్నారు.
కేజ్రీవాల్ ఫోన్లో పరామర్శ.. మొరాదాబాద్లో సచిన్ పైలట్ నిర్బంధం
మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేతలు సచిన్ పైలట్, ఆచార్య ప్రమోద్లను కూడా యూపీ పోలీసులు మొరాదాబాద్లో అడ్డుకున్నారు. లఖింపుర్కి వెళ్తుండగా వారిని నిర్బంధించారు. బీఎస్పీ ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా లఖింపుర్ ఖేరికి గురువారం వెళ్లనున్నారు. అలాగే, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా గురువారం బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. లఖింపుర్ ఘటనకు నిరసనగా భారీ వాహన శ్రేణితో అక్కడికి వెళ్లనున్నట్టు పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రగత్సింగ్ వెల్లడించారు. మరోవైపు, లఖింపుర్ ఖేరి ఘటనలో మృతిచెందిన నక్షత్ర సింగ్ కుటుంబ సభ్యులను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫోన్లో పరామర్శించారు. ఆప్ నేతలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా లఖింపుర్ వెళ్లి బాధిత రైతు కుటుంబాలను పరామర్శించారు.