మా బలమంతా అదే.. ఛాన్స్‌ ఇచ్చి ఫలితం చూడండి: రాజ్‌నాథ్‌

‘‘ఈ ఎన్నిక మీ భవిష్యత్తును మార్చేందుకు ఓ అవకాశం. మాకు వరుసగా 10 నుంచి 15 ఏళ్ల పాటు సేవ చేసే అవకాశం ఇవ్వండి.. ఫలితాలు మీరే చూడండి’’....

Published : 12 Feb 2022 02:19 IST

దేహ్రాదూన్‌: అటు దేశంలో.. ఇటు రాష్ట్రంలోనూ భాజపా అవినీతి రహిత పాలనను అందిస్తోందని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. విశ్వసనీయతే తమ పార్టీకి అతి పెద్ద బలమన్న ఆయన.. ఉత్తరాఖండ్‌లో అభివృద్ధి కొనసాగించేందుకు భాజపాకు మళ్లీ ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఘన్సాలీ, కర్ణప్రయాగ్‌లలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో రాజ్‌నాథ్‌ ప్రసంగించారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలో, నరేంద్ర మోదీ హయాంలోనూ దేశానికి రెండుసార్లు అవినీతి రహిత ప్రభుత్వాలను అందించిన ఘనత భాజపాదేనన్నారు. అలాగే, ఉత్తరాఖండ్‌లోనూ క్లీన్‌ ప్రభుత్వాలను ఇచ్చిందన్నారు. తమ పార్టీ అభ్యర్థులకు అవినీతి మరకలేదన్నారు. విశ్వసనీయతే తమకు అతిపెద్ద బలమని పునరుద్ఘాటించారు.

ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే ట్రెండ్‌ను ఉత్తరాఖండ్‌ ప్రజలు ఈసారి బ్రేక్‌ చేయాలని రాజ్‌నాథ్‌ విజ్ఞప్తి చేశారు. ప్రతిసారీ ప్రభుత్వం మారితే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ‘‘ఈ ఎన్నిక మీ భవిష్యత్తును మార్చేందుకు ఓ అవకాశం. మాకు వరుసగా 10 నుంచి 15 ఏళ్ల పాటు సేవ చేసే అవకాశం ఇవ్వండి.. ఫలితాలు మీరే చూడండి’’ అని రాజ్‌నాథ్‌ అన్నారు. మరోవైపు, 70 సీట్లు కలిగిన ఉత్తరాఖండ్‌ అసెంబ్లీకి ఈ నెల 14న ఒకే దశలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని