ఎన్నికలకు ముందే ప్రత్యేక హోదా పునరుద్ధరించాలి

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ముందే ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నాయకుడు ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 27 Jun 2021 01:11 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ముందే ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నాయకుడు ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 370 అధికరణ రద్దును కేంద్రం వెనక్కి తీసుకునేవరకు గుప్కార్‌ కూటమి రాజీ పడబోదని స్పష్టం చేశారు. ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన శనివారం వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌ అంశంలో రాజ్యాంగ హక్కుల కోసం చట్టబద్ధంగా, రాజకీయంగా, శాంతియుతంగా పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో గుప్కార్ కూటమి అజెండాకు విరుద్ధంగా చర్చకు వచ్చిన ఏ అంశంపైనా తాము మాట్లాడలేదన్నారు.  సుదీర్ఘ ప్రయత్నం తర్వాత అధికరణ 370ని రద్దు చేయడంలో భాజపా సఫలమైందని పేర్కొన్నారు. తాము కూడా ఎంత కాలమైనా ప్రత్యేకహోదా పునరుద్ధరణపై వెనక్కి తగ్గబోమని నొక్కి చెప్పారు. జమ్మూకశ్మీర్‌ అంశంలో ఇచ్చిన హామీలను గత ప్రధానులెవ్వరూ నెరవేర్చకపోవడంతో తాము కేంద్రంపై విశ్వాసం కోల్పోయామన్నారు. కేంద్రం, జమ్మూకశ్మీర్‌ మధ్య ఏర్పడిన అంతరాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. 

జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని సమావేశానికి హజరైన రాజకీయ పార్టీల నాయకులతో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని