Revanth reddy: అమ్ముడుపోయిన వారికి ఓట్లు వేయొద్దు.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated : 03 Sep 2022 16:25 IST

మునుగోడు: కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజీనామా చేస్తే ఎక్కడైనా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. రాజగోపాల్‌ రెడ్డిని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే.. దాన్ని ఆయన రూ.22 వేల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి ఓటేయొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మునుగోడులో పార్టీ నేతలతో కలిసి రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

మునుగోడులో 97వేల ఓట్లు కాంగ్రెస్‌ పార్టీ ఆస్తి అని రేవంత్‌ రెడ్డి అన్నారు. అందరం కలిసి పనిచేస్తే ఎవర్నైనా పడగొట్టచ్చని చెప్పారు. మండల స్థాయి నాయకులు రోజుకు రెండు గంటలు సమయం కేటాయిస్తే విజయం కాంగ్రెస్‌దేనని విశ్వాసం వ్యక్తంచేశారు. రాజగోపాల్‌ రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ అన్ని అవకాశాలూ కల్పిస్తే.. ఆయన వేరే పార్టీకి అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని భాజపా చూస్తోందన్నారు. అపారమైన అనుభవం కలిగిన జానారెడ్డి, దామోదర్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, వెంకట్‌రెడ్డి సలహాతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. 

సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ రాష్ట్ర విలీన కార్యక్రమాలను స్వాతంత్య్ర ఉత్సవాలతో సమానంగా నిర్వహించాలని రేవంత్‌రెడ్డి అన్నారు. సాయుధపోరాటంలో నల్గొండకు చెందిన అనేక మంది సమిధలయ్యారని గుర్తు చేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి 2023 వరకు వజ్రోత్సవాలు నిర్వహించాలని, ఇందుకోసం రూ.5వేల కోట్లు కేంద్రం కేటాయించాలన్నారు. గడిచిన 8 ఏళ్లుగా సెప్టెంబర్‌ 17ను ఎందుకు నిర్వహించలేదని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.

కమ్యూనిస్టుల మద్దతుపై ఉత్తమ్‌ వ్యాఖ్యలు

తనను గెలిచిపించిన ప్రజల్ని, పార్టీని రాజగోపాల్‌ రెడ్డి మోసం చేశారని ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. సిట్టింగ్‌ స్థానాన్ని అందరం కలిసి ఎలాగైనా నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. భాజపా వస్తే మత ఘర్షణలు చెలరేగుతాయని ఉత్తమ్‌ అన్నారు. హిందువులకు, ఇతర మతాల వారికి గొడవ పెట్టి ప్రయోజనం పొందుతారని, ఇదే తరహాలో దేశంలో పలు చోట్ల ఆ పార్టీ లబ్ధి పొందిందని గుర్తు చేశారు. 8 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోచుకుతింటున్న తెరాసకు... ఎంతో చరిత్ర ఉన్న కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వడాన్ని తెలంగాణ సమాజం ఏమాత్రం క్షమించదని ఉత్తమ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని