Revanth Reddy: కలిసి పనిచేద్దాం రండి.. పార్టీని వీడిన వారందరికీ ఇదే ఆహ్వానం: రేవంత్‌రెడ్డి

క్షణికావేశంలో కాంగ్రెస్‌ను వీడిన వారందరూ తిరిగి రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 18 May 2023 18:03 IST

హైదరాబాద్‌: కర్ణాటకలో కాంగ్రెస్‌ది గెలుపేకాదంటూ  భాజపాను కాపాడేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భాజపా, భారాస వేర్వేరు కాదని మరోసారి పునరుద్ఘాటించారు. కర్ణాటక ఫలితాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. క్షణికావేశంలో కాంగ్రెస్‌ను వీడిన వారందరూ తిరిగి రావాలని రేవంత్‌రెడ్డి కోరారు. 

‘‘దాదాపు 40ఏళ్ల తర్వాత కర్ణాటక ప్రజలు.. మోదీ కుట్రలను తిప్పికొట్టి విస్పష్టమైన తీర్పునిచ్చారు. దీంతో ప్రజాస్వామ్య వాదులందరికీ ఒక విశ్వాసం, నమ్మకం వచ్చింది. మోదీ బ్రాండ్‌కు కాలం చెల్లింది. మోదీని ఓడించడానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం అవసరముందని ప్రజలు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్‌.. మోదీని సమర్థిస్తూ భాజపా ఓటమిని చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సీఎం కేసీఆర్‌ మాటలు మోదీ ప్రభుత్వాన్ని సమర్థించే విధంగా, బలపర్చేలా ఉన్నాయి. ప్రజల గెలుపును అవహేళన చేసే విధంగా ఉన్నాయి. మోదీ, కేసీఆర్‌ వేర్వేరు కాదు. నిన్న కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిచింది. రేపు తెలంగాణలో కాంగ్రెస్‌ గెలవబోతోంది, ఎల్లుండి జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన అన్నిరకాల త్యాగాలు చేసింది కాంగ్రెస్‌ పార్టీ. వివేక్‌ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, జూపల్లి కృష్ణారావు లాంటి పలువురు నాయకులకు భాజపా సిద్ధాంతాలతో సంబంధం లేదు. భాజపాను వాళ్లు నమ్మరు.. వాళ్లను భాజపా నమ్మదు. వివిధ కారణాల చేత భారాసను భాజపా ఓడిస్తుందేమోనన్న అపోహలతో కొందరు ఆపార్టీలో చేరారు. ఇప్పుడు వాస్తవం వాళ్లకు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీ తల్లిలాంటిది. మళ్లీ తిరిగి అక్కున చేర్చుకుంటుంది. తెలంగాణలో  కేసీఆర్‌ వ్యతిరేక పునరేకీకరణ జరగాలి. ఇది నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల కోరిక.. ఆలోచన. పార్టీని వీడిన మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. కేసీఆర్‌ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా అందరూ ముందుకు రావాలి. తెలంగాణ అభ్యున్నతికోసం కలిసి పనిచేద్దామని ఆహ్వానిస్తున్నా. కేసీఆర్‌ను ఓడించడం భాజపా వల్ల కాదు. భాజపా, కేసీఆర్‌ వేర్వేరు కాదు ఒక్కటే. కర్ణాటక ప్రభావం తెలంగాణలోనూ ఉంటుంది. అన్ని వర్గాలు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నాయి. కేసీఆర్‌ తప్ప దేశంలోని విపక్షాలు కాంగ్రెస్‌ రావాలని కోరుతున్నాయి’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని