Ts News: 317జీవోపై భాజపా ఎంపీలు అలా ఎందుకు చేయలేకపోతున్నారు?: రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చీలిక తీసుకొచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. చెరో వర్గాన్ని మచ్చిక చేసుకుందామని తెరాస, భాజపా

Published : 11 Jan 2022 01:14 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చీలిక తీసుకొచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. చెరో వర్గాన్ని మచ్చిక చేసుకుందామని తెరాస, భాజపా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. గాంధీభవన్‌లో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పార్టీ కార్యాలయంలో రాత్రి నిద్ర చేస్తే తెరాసకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు. 24 గంటల్లో ముగిసిపోవాల్సిన తతంగాన్ని 10 రోజులుగా సాగదీస్తున్నారని ధ్వజమెత్తారు. బండి సంజయ్‌ ఏం సాధించారని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రానికి వస్తున్నారని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

‘‘రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేస్తోంది. రాష్ట్రం పంపిన దస్త్రాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. 317 జీవోలో తప్పు ఉందంటే.. దాన్ని ఆమోదించింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదించింది? ఇవాళ 317 జీవోను అమలు చేసి సీఎం కేసీఆర్‌ తప్పు చేస్తున్నారంటే.. ఆ తప్పుకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. భాజపా ప్రోత్సాహం వల్లే సీఎం కేసీఆర్‌ జీవోను అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. 317 జీవోలో తప్పులున్నాయని గుర్తించి సవరించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి అది కష్టమైన పని కాదు. ఈ జీవో ద్వారా తెలంగాణలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం జరుగుతుంది.. ఈ జీవోపై తక్షణమే స్టే ఇవ్వండి.. అని రాష్ట్రానికి చెందిన భాజపా ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేయాలి. అలా ఎందుకు చేయలేకపోతున్నారు. 
జోనల్‌ విధానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుంది. జీవోలో ఎలాంటి మార్పులు చేయాలన్నా కేంద్ర మంత్రివర్గ ఆమోదం కావాలి. కేంద్రంలో ఉన్నది భాజపా ప్రభుత్వం. రాష్ట్రానికి చెందిన కిషన్‌ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. కేసీఆర్‌ పంపిన ప్రతిపాదనలను ఎలా ఆమోదించారు. ఇదంతా చేసిన భాజపా ప్రభుత్వం ఇప్పుడేమో 317 జీవోను సవరించాలని పోరాటాలు చేస్తున్నామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. మీరు పోరాటాలు చేయాల్సిన పని లేదు. మీ చేతిలో అధికారం ఉంది. ఒక్క ఫిర్యాదుతో జీవోలో మార్పులు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉంది. అధికారం చేతిలో ఉన్నప్పుడే రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఏం చేస్తారు? ఇది ముమ్మాటికీ ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది’’ అని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని