Revanth reddy: 10శాతం చెల్లించాలి.. లేదంటే సంస్థ టెండర్‌ రద్దు చేయాలి: రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలోనే ఓఆర్‌ఆర్‌ను తెగనమ్మారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఓఆర్‌ఆర్‌ను ముంబయికి చెందిన కంపెనీకి తక్కువకే కట్టబెట్టారని.. ఇప్పుడు మరో దోపడీకి తెర లేపారని మండిపడ్డారు.

Updated : 24 May 2023 16:09 IST

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలోనే ఓఆర్‌ఆర్‌ను తెగనమ్మారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఓఆర్‌ఆర్‌ను ముంబయికి చెందిన కంపెనీకి తక్కువకే కట్టబెట్టారని.. ఇప్పుడు మరో దోపడీకి తెర లేపారని మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు.

‘‘ప్రభుత్వ ఆలోచనను కాంగ్రెస్‌ పార్టీ పదే పదే ప్రజలకు వివరిస్తూ వస్తోంది. లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లో 10శాతం చెల్లించాల్సి ఉంటుంది. రూ.7,388 కోట్లలో రూ.738 కోట్లను 30 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఇవి చెల్లించకుండా ఇంకా సమయం అడుగుతున్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థకు అనుకూలంగా ఉండేలా అధికారులపై మంత్రి కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారు. ఈ నెల 26వ తేదీలోగా ఐఆర్‌బీ సంస్థ నిబంధనల ప్రకారం 10శాతం నిధులు చెల్లించాలి. లేకపోతే సంస్థకు కేటాయించిన టెండర్లను రద్దు చేయాలి. సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వకుంటే హెచ్‌ఎండీఏ, హెచ్‌జీసీఎల్‌ కార్యాలయాలను ముట్టడిస్తాం. జరిగిన అవినీతిపై కాగ్, సెంట్రల్‌ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తాం. ఇంత దోపిడీ జరుగుతున్నా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎందుకు స్పందించడం లేదు’’ అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం...

కాంగ్రెస్‌ పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ‘‘నా టికెట్‌తో సహా ప్రతి టికెట్‌ కు సర్వేనే ప్రామాణికం. కర్ణాటకలో సిద్దరామయ్యకు కూడా అడిగిన టికెట్‌ కాకుండా సర్వే ఆధారంగానే టికెట్‌ ఇచ్చారు. పార్టీలో చేరే వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఇన్‌ఛార్జి ఠాక్రే ఇదే విషయాన్ని చెప్పారు.. అది నాకు కూడా వర్తిస్తుంది. పొంగులేటి పార్టీలో చేరిక ప్రతిపాదన వచ్చినప్పుడు చర్చ చేస్తాం. ఎన్నికల సమయంలో పొత్తులపై చర్చిస్తాం’’  అని రేవంత్‌రెడ్డి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని