Telangana News: రేవంత్‌ను ఆత్మీయంగా పలకరించిన జగ్గారెడ్డి

ఇటీవల కాలంలో పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు.

Updated : 11 Mar 2022 15:07 IST

హైదరాబాద్‌: ఇటీవల కాలంలో పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇద్దరు నేతలు పరస్పరం పలకరించుకున్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రేవంత్‌రెడ్డి ఎదురుపడగానే జగ్గారెడ్డి ఆయన్ను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగా కరచాలనం చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం ఇద్దరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 20 నిమిషాలకు పైగా వారి సమావేశం జరిగింది. ఆ తర్వాత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో ఏం మాట్లాడుకున్నామనే విషయాన్ని బహిర్గతం చేయబోమని చెప్పారు.

గత కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్‌లో కొందరు నేతల వ్యవహార శైలిపై జగ్గారెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీని సైతం వీడుతానని ప్రకటించారు. ఇటీవల మెదక్‌ జిల్లాలో రేవంత్‌రెడ్డి పర్యటనపైనా జగ్గారెడ్డి విమర్శలు చేశారు. జిల్లా పర్యటనకు వస్తున్నట్లు తనకు సమాచారం కూడా లేదన్నారు. ఇలా చాలా సార్లు అవమానం జరిగిందంటూ కొద్దిరోజుల క్రితం సీఎల్పీ సమావేశం సందర్భంగా భట్టి విక్రమార్క తదితరులతో చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్‌రెడ్డిని జగ్గారెడ్డి ఆత్మీయంగా పలకరించుకోవడం ఆసక్తిగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని