Munugode bypoll: గిరిజనుల భూములు గుంజుకొని సినిమావాళ్లకు కట్టబెట్టాలని చూస్తున్నారు: రేవంత్‌

గిరిజనుల భూములు గుంజుకొని సినిమా వాళ్లకు కట్టబెట్టాలని చూస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 26 Oct 2022 01:36 IST

మునుగోడు: గిరిజనుల భూములు గుంజుకొని సినిమా వాళ్లకు కట్టబెట్టాలని చూస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గిరిజనుల భూములకు హక్కులు కల్పించి వారే అమ్ముకునేందుకు అవకాశం కల్పించేట్లు వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ హక్కులు కల్పిస్తామంటే తెరాస హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. గిరిజనుల భూములను గద్దల్లా తన్నుకుపోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఇవాళ నారాయణపురం మండలం కడీలబావి తండా రోడ్‌షోలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. గిరిజనులకు చదువుల్లో, చట్ట సభల్లో అవకాశం కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్‌దేనని రేవంత్‌ స్పష్టం చేశారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక గిరిజనుల భూములపై కన్నేశారని, మల్లన్నసాగర్‌, డిండి, శివన్నగూడెం భూములు గుంజుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటు వేసేముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎవరేం ఇచ్చినా తీసుకొని.. ఓటు మాత్రం కాంగ్రెస్‌ పార్టీకి వేయాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని