Munugode Bypoll: దొంగల్లా రాత్రి కాదు.. దమ్ముంటే ఎదురుగా రావాలి: రేవంత్‌

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజగోపాల్‌రెడ్డి అసెంబ్లీలో సమస్యలపై కొట్లాడలేదని విమర్శించారు. శత్రువు పంచన చేరి కన్నతల్లిలాంటి కాంగ్రెస్‌ను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. 

Published : 12 Oct 2022 01:12 IST

హైదరాబాద్‌: తెరాస, భాజపా రెండు పార్టీలు కాంగ్రెస్‌ను లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వరుసగా ఇవాళ మూడోరోజు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా చండూరు మండలంలో రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. పుల్లెంల, బంగారిగడ్డ, చామలపల్లి, కస్తాల గ్రామాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. పుల్లెంల గ్రామంలో నిర్వహించిన రోడ్డు షోలో రేవంత్ రెడ్డి .. భాజపా, తెరాసలపై తీవ్ర విమర్శలు చేశారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజగోపాల్‌రెడ్డి అసెంబ్లీలో సమస్యలపై కొట్లాడలేదని విమర్శించారు. శత్రువు పంచనచేరి కన్నతల్లిలాంటి కాంగ్రెస్‌ను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులను ఇచ్చి పెంచి పోషించిన కాంగ్రెస్‌కు ద్రోహం చేయడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఏం వెలగబెట్టారని నిలదీశారు. ఇద్దరూ దొంగలకు సద్దికట్టే రకమేనని, ఊరికి మేలు చేసేవారు కాదని విమర్శించారు. కష్టం వచ్చిందని కేసీఆర్‌ ఇప్పుడు కమ్యూనిస్టుల కాళ్లు పట్టుకుంటున్నారని, ఆ పార్టీ కార్యకర్తలంతా ఆత్మప్రభోదానుసారం కాంగ్రెస్‌కు ఓటువేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. తెరాస, భాజపాలకు భయం పుట్టి చండూరులో తమ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారని ఆరోపించారు. దొంగల్లా రావడం కాదు.. దమ్ముంటే ఎదురుగా వచ్చి చూడాలని రేవంత్‌ సవాల్‌ విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని