Rajasthan: ఖర్గేజీ.. ఇది విన్నారా..? గహ్లోత్‌ను మోదీ పొగిడారు.. : సచిన్ పైలట్

రాజస్థాన్‌లో కాంగ్రెస్ నేతలు అశోక్‌ గహ్లోత్‌, సచిన్ పైలట్ వర్గాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో పైలట్ మీడియాతో మాట్లాడారు. 

Updated : 02 Nov 2022 14:11 IST

జైపుర్:రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పీఠం కాపాడుకోవాలని అశోక్ గహ్లోత్‌, దానిని దక్కించుకోవాలని సచిన్ పైలట్ చేసే యత్నాలతో ఆ రెండు వర్గాల మధ్య వైరం బయటపడుతూనే ఉంది. తాజాగా పైలట్ చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా ఉన్నాయి. రాజస్థాన్‌లో పార్టీని ధిక్కరిస్తూ తిరుగుబాటు చేసే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన సూచించారు. 

‘కాంగ్రెస్‌ ఘన చరిత్ర కలిగిన పార్టీ. ఈ పార్టీపై తిరుగుబాటు చేసిన వారిపై కొత్త అధ్యక్షుడు చర్యలు తీసుకోవాలి. రాజస్థాన్‌లో నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితికి ముగింపు పలకాలి. సెప్టెంబర్‌లో జరగాల్సిన సీఎల్పీ సమావేశం ఆగిపోయింది. ఏఐసీసీ దానిని క్షమశిక్షణా రాహిత్యంగా పరిగణించింది. నిబంధనలు అందరికీ ఒక్కటే. దీనిపై కొత్త అధ్యక్షుడు త్వరలో నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను. ఇక నిన్న జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ.. అశోక్‌ గహ్లోత్‌పై ప్రశంసలు కురిపించడం ఆసక్తి కలిగించింది. గులాం నబీ ఆజాద్‌ను కూడా పార్లమెంట్‌లో ఇలాగే పొగిడారు. తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. దీనిని తేలిగ్గా తీసుకోకూడదు’ అని అంటూ మీడియాతో మాట్లాడారు. 

ఇటీవల జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలో గహ్లోత్‌ను నిలబెట్టేందుకు పార్టీ అగ్రనేత సోనియా గాంధీ కుటుంబం ప్రయత్నించింది. అందుకు ఆయన అంగీకరించినా.. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పదవి వీడేందుకు విముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 92మంది ఎమ్మెల్యేలు గహ్లోత్‌ వారసుడిని ఎన్నుకొనేందుకు ఉద్దేశించిన సీఎల్పీ భేటీకి డుమ్మా కొట్టారు. స్పీకర్‌ను కలిసి పైలట్‌ను సీఎంని చేయకుండా అడ్డుకొనేందుకు మూకుమ్మడి రాజీనామా చేస్తామని బెదిరించారు. రాజకీయ సంక్షోభానికి గహ్లోత్‌ వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలే కారణమని ఆ పార్టీ కేంద్ర పరిశీలకుల బృందం తేల్చింది. ఆ పరిణామం తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానానికి, గహ్లోత్‌కు మధ్య దూరం పెరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. 2020లో పైలట్‌ కూడా కొందరు ఎమ్మెల్యేలతో గహ్లోత్‌ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగరేసిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని