కాంగ్రెస్‌ ప్రజలను తప్పు దోవ పట్టించింది: నడ్డా

కొవిడ్‌-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్‌ తమ రాజకీయాలతో దేశాన్ని బలహీన పరచవద్దని విజ్ఞప్తి చేస్తూ బీజేపీ చీఫ్‌ నడ్డా మంగళవారం సోనియా గాంధీకి లేఖ రాశారు

Updated : 12 May 2021 04:47 IST

దిల్లీ: కొవిడ్‌-19కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్‌ తమ రాజకీయాలతో దేశాన్ని బలహీన పరచవద్దని విజ్ఞప్తి చేస్తూ భాజపా చీఫ్‌ నడ్డా మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థతుల్లో కాంగ్రెస్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, భయాందోళలను కలిగిస్తోందని ఆరోపించారు. రాహుల్‌ గాంధీతో సహా పార్టీ నాయకుల ప్రవర్తనను తప్పుబట్టారు. కాంగ్రెస్‌ నాయకులు  సెంటర్‌ ఫర్‌ కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌ పై నిరంతరం విమర్శలు చేయడం తననను బాధపెట్టిందని తెలిపారు. 

కొవిడ్‌కు వ్యతిరేక పోరాటంలో భారత ప్రభుత్వం నిమగ్నమై ఉందని అన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత ఏడాదిగా కరోనా మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని అణగదొక్కే లక్ష్యంతో కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారని నడ్డా ఆరోపించారు.  

భారత్‌లో తయారైన వ్యాక్సిన్‌ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్‌ ప్రచారం చేసిందన్నారు. టీకా కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. బీజేపీ, ఎన్‌డిఏ ప్రభుత్వాలు టీకాలను ఉచితంగా ఇస్తుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వమున్న రాష్ట్రాల్లో టీకా ఎందుకు ఉచితంగా అందించడం లేదని ప్రశ్నించారు. 

రాహుల్‌ గాంధీ మొదట లాక్‌డౌన్‌ వ్యతిరేకించి, తర్వాత లాక్‌డౌన్‌ పెట్టమని డిమాండ్‌ చేయడం, సూపర్‌ స్ప్రెడర్‌ కార్యక్రమాలకు హాజరు కావడం, ఇతర ప్రాంతాల్లో జరిగిన ర్యాలీలను నిందించడం వంటి చర్యలు నీచంగానూ, చిన్నతనంగానూ ఉన్నాయని నడ్డా మండిపడ్డారు. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్ట్‌లో విషయంలో కాంగ్రెస్‌ చేస్తున్న హంగామాను ప్రస్తావిస్తూ.. 2012లో ఎన్‌డీఏ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కొత్త శాసనసభా భవనం నిర్మాణానికి సంబధించిన పనులు జరుగుతున్నాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని