AP News: గ్రామ సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్‌ కావాలంటే ఆ పరీక్ష పాసవ్వాల్సిందే!

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్ కావాలంటే డిపార్టుమెంట్ పరీక్ష తప్పక పాస్ కావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Updated : 26 Jul 2021 16:22 IST

అమరావతి: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్ కావాలంటే డిపార్టుమెంట్ పరీక్ష తప్పక పాస్ కావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఐఎఎస్‌లు సహా అన్ని విభాగాల ఉద్యోగులకూ మొదట్నుంచీ ఈ విధానమే అమలవుతోందన్నారు. గ్రామవార్డు  సచివాలయాల్లో నియమితులైన వారిలో ఎవరి ఉద్యోగాలూ పోవని హామీ ఇచ్చారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రొబేషన్ నుంచి పర్మినెంట్ అయ్యేందుకు నిబంధనల మేరకే పరీక్ష ఉంటుంది. పరీక్ష పాస్ కాకపోతే ప్రొబేషన్ పొడిగిస్తారు. పరీక్ష పాసైన వెంటనే ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారు. సచివాలయ ఉద్యోగులకు డిపార్టుమెంటల్ టెస్టు తప్ప మరో పరీక్ష ఉండదు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఏ ఒక్కరి ఉద్యోగం పోదు.. ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా లేదు’’ అని వివరించారు.

వాటిని చంద్రన్న గుంతలు అనాలేమో!

ఇక రాజధాని అమరావతిలో వైకాపా నేతలే రహదారి కంకర అమ్ముకుంటున్నారని వస్తున్న ఆరోపణలను సజ్జల ఖండించారు. అవన్నీ అవాస్తవాలని ఆరోపించారు. రోడ్డుకు వేసిన కంకర అమ్ముకునే వారిని పట్టుకుని అప్పగించి ఉండొచ్చు కదా? అని ప్రశ్నించారు. ‘‘జగన్ రాకతో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తగ్గాయి. అమరావతిలో దోపిడీ దారుల ఆదాయం తగ్గింది. బహుశా వారే కంకర అమ్ముకుని ఉండొచ్చు. తెదేపా హయాంలో కనీసం కరకట్టనూ విస్తరించలేదు. రైతులకు కౌలు పెంచింది, కరకట్ట నిర్మిస్తున్నది సీఎం వైఎస్ జగనే. తెదేపా హయాంలో అమరావతిలో లక్షల కోట్లు అక్రమాలు జరిగాయి. రాజధాని రైతులను తెదేపా నేతలు మళ్లీ రెచ్చగొట్టి, భ్రమల్లో పెట్టాలని చూస్తున్నారు. రూ. వందలకోట్లు దోచుకున్న వారి కలలను సీఎం జగన్ ఛిన్నాభిన్నం చేశారు. లక్షల మంది పేద ప్రజలకు సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. రహదారులపై గుంతలు పడ్డాయని తెదేపా వారు ఎక్కడపడితే అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. రాష్ట్రంలో  దెబ్బతిన్న రహదారులన్నీ తెదేపా హయాంలో దెబ్బతిన్నవే. తెదేపా హయాంలో పడిన గుంతలను పూడ్చేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు. రహదారులపై పడిన గుంతలను చంద్రన్న గుంతలు అనాలి. రోడ్ల నిర్మాణానికి రూ.2 వేలకోట్లతో ప్రభుత్వం టెండర్లను పిలిచింది. వర్షాలు అయిపోయాక రహదారి పనులు ప్రారంభమవుతాయి. రాయలసీమ లిఫ్టుపై తెదేపా వైఖరి ఏంటో చంద్రబాబు చెప్పాలి. ఆయన హయాంలోనే పాలమూరు రంగారెడ్డి తెలంగాణ కట్టింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును  అడ్డుకునేందుకు గతంలో ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ దీక్ష చేశారు. తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకునేందుకు తెదేపా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. రాయలసీమకు ఏవిధంగా అన్యాయం జరుగుతుందో జనంలోకి  వెళ్లి తెదేపా నేతలు చెప్పాలి. లిఫ్టు వల్ల రాయలసీమకు ఎక్కడా అన్యాయం జరగడం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకెళ్లాలని కాలువలు వెడల్పు చేయాలని సీఎం నిర్ణయించారు’’ అని అన్నారు.

సంక్షోభం ఎదుర్కొనేందుకు జగన్‌ 16గంటలు పని చేస్తున్నారు!

ఎవరికైనా అవసరాలు పెరిగినప్పుడే వనరులకు మించి అప్పు చేస్తారని చెప్పిన సజ్జల కేంద్రం అడ్డగోలుగా అప్పులు చేయడం లేదా? కాదని భాజపా నేతలు చెప్పమనండి అంటూ మండిపడ్డారు. ‘రాష్ట్ర విభజన అనంతరం రూ.90 వేల కోట్లతో చంద్రబాబు పాలన ప్రారంభమైంది. చంద్రబాబు దిగిపోయే ముందు మాకు రూ. 2 లక్షల 60 వేల కోట్లు అప్పు, రూ.60 వేలకోట్లు పెండింగ్ బిల్లులు అప్పగించారు. సంక్షేమం అభివృద్ధి పథకాలు అమలు చేసేందుకే అప్పులు చేయాల్సి వస్తోంది. అప్పు చేయకపోతే డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం.. ప్రింట్ చేసుకుంటామా.. మేము అప్పు తెచ్చిన ప్రతి పైసాకు సంపద సృష్టి జరుగుతోంది. బడుగుల జీవితంలో ప్రగతి వస్తోంది. కొవిడ్‌తో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గింది. 20-30 వేల కోట్లు అదనంగా పెట్టాల్సి వస్తోంది. కరోనా వల్ల రాష్ట్రంలో సంక్షోభం భయంకరంగా ఉంది. సంక్షోభం నుంచి ఎలా బయటపడాలా? అని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. సంక్షోభం సమర్థంగా ఎదుర్కొనేందుకు  రోజుకు 16 గంటలు పాటు కష్టపడి పనిచేస్తున్నారు. ధరల పెరుగుదలపై  మమ్మల్ని నిలదీసే నైతిక హక్కు తెదేపాకు లేదు. చంద్రబాబు హయాంలో జరిగిన మాఫియా పాలనను ప్రజలు మరచిపోలేదు. మత పరంగా రెచ్చగొట్టేందుకు భాజపా నేతలు ప్రయత్నిస్తున్నారు. పోలవరం సహా రావాల్సిన నిధులను రప్పించేందుకు జీవీఎల్ సహా నేతలు  చర్యలు తీసుకోవాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను  రప్పిస్తే భాజపా నేతలకు మంచి జరుగుతుంది’ అని సజ్జల చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని