Sasikala: మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి..?

తమిళనాడులో ఏఐఏడీఎంకే బహిష్కృత నేత శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Updated : 30 May 2021 15:36 IST

కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత వచ్చేందుకు సన్నాహాలు

చెన్నై: తమిళనాడులో ఏఐఏడీఎంకే బహిష్కృత నేత శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆమె సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఈమధ్యే జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు శశికళ ప్రకటించారు. ప్రస్తుతం ఏఐఏడీఎంకే ఓటమి చెందిన నేపథ్యంలో.. తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అన్నాడీఎంకే అధినేత మరణం తర్వాత పార్టీ తీవ్ర ఒడిదొడుకులకు గురైన విషయం తెలిసిందే. అదే సమయంలో జైలు నుంచి విడుదలైన పార్టీ బహిష్కృత నేత శశికశ కూడా రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఓటమి పాలయ్యింది. ఇదే అదునుగా భావించిన శశికళ.. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమౌతున్నారనే ప్రచారం మొదలయ్యింది. ఇందుకు సంబంధించి శశికళ మాట్లాడుతన్న ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘ఎలాంటి ఆందోళన అవసరం లేదు. పార్టీ విషయాలను తప్పకుండా చక్కబెడతాను. ధైర్యంగా ఉండండి. కరోనా ముగిసిన తర్వాత మళ్లీ నేను వస్తాను’ అని శశికళ సదరు ఆడియోలో చెప్పారు. దీనికి జవాబుగా.. ‘మీ వెనకే మేముంటాం అమ్మా’ అని కొందరు పార్టీ కార్యకర్తలు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని టీటీవీ దినకరన్‌ వ్యక్తిగత సిబ్బంది కూడా ధ్రువీకరించారు.

ఇదిలాఉంటే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకే పార్టీ జనరల్‌ సెక్రటరీగా శశికళ నియమితులయ్యారు. అయితే, 2017లో అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో ఆమె జైలుకు వెళ్లారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2017 సెప్టెంబర్‌లో శశికళతో పాటు ఆమె అల్లుడు దినకరన్‌ను ఏఐఏడీఎంకే పార్టీ నుంచి తొలగించింది. తాజాగా మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అక్రమాస్తుల కేసులో దాదాపు నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించిన శశికళ, ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని