బిహార్‌లో ప్రారంభమైన 2వ విడత పోలింగ్‌

బిహార్‌లో మూడు విడతల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో కీలకంగా చెబుతున్న రెండో దశ ఓటింగ్‌ ప్రారంభమైంది. భారీ భద్రత మధ్య పోలింగ్‌ జరుగుతోంది. ఇందుకోసం 17 జిల్లాల్లో మొత్తం 41,362 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు..........

Updated : 03 Nov 2020 13:19 IST

పట్నా: బిహార్‌లో మూడు విడతల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో కీలకంగా చెబుతున్న రెండో దశ ఓటింగ్‌ ప్రారంభమైంది. భారీ భద్రత మధ్య పోలింగ్‌ జరుగుతోంది. ఇందుకోసం 17 జిల్లాల్లో మొత్తం 41,362 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

మహాకూటమి తరఫున సీఎం అభ్యర్థి అయిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌(రాఘోపుర్‌), ఆయన సోదరుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌(హసన్‌పుర్‌) పోటీ చేస్తున్న స్థానాల్లో నేడే పోలింగ్‌ జరుగుతోంది. నీతీశ్‌ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న నంద్‌ కిశోర్‌ యాదవ్‌-భాజపా(పట్నా సాహెబ్‌), శ్రవణ్‌కుమార్‌-జేడీయూ (నలంద), రామ్‌సేవక్‌ సింగ్‌-జేడీయూ(హథువా), రాణా రణ్‌ ధీర్‌ సింగ్‌-భాజపా(మధుబన్‌)ల భవితవ్యాన్నీ ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు.

అక్టోబర్‌ 28న జరిగిన తొలి విడత ఎన్నికల్లో 53.4శాతం పోలింగ్‌ నమోదైంది. 71 స్థానాల్లో 1066 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసినా.. ఔరంగాబాద్‌లో పేలుడు పదార్థాలు లభ్యం కావడం కలకలం సృష్టించింది. క్రీడా మైదానంలో మ్యూజియం నిర్మాణం వ్యతిరేకిస్తూ లఖిసరయి జిల్లాలోని బల్గుదార్‌ గ్రామస్థులు ఓటింగ్‌ను బహిష్కరించారు. రెండో విడత నేడు ప్రారంభం కాగా.. తుది దశ ఎన్నికలు నవంబరు 7న జరగనున్నాయి. ఈ నెల 10న ఫలితాలు వెలువడనున్నాయి. 

దేశవ్యాప్తంగా 54 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు..
మరోవైపు పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు ప్రారంభమయ్యాయి. వీటిలో అత్యధికంగా 28 స్థానాలు మధ్యప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఇక్కడి ఎన్నికలు అటు కాంగ్రెస్‌కు, ఇటు భాజపాకు చాలా కీలకం. అధికార పీఠాన్ని కూడా నిర్దేశించే అవకాశం ఉంది. 12 మంది మంత్రుల భవితవ్యాన్ని కూడా ఇవి తేల్చనున్నాయి. మధ్యప్రదేశ్‌తో పాటు గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, ఝార్ఖండ్‌, కర్ణాటక, నాగాలాండ్‌, ఒడిశాల్లోనూ పలు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నికను ఇటు తెరాస, అటు భాజపా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని