
AP News: సీఎం జగన్కు ఆ నైతిక హక్కులేదు: సోము వీర్రాజు
విజయవాడ: ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనే నైతిక హక్కు సీఎం జగన్కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయవాడలో జరుగుతున్న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన ఏపీ సర్కార్ తీరుపై మండిపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో భాజపాకే చిత్తశుద్ధి ఉందన్నారు. మాట తప్పను.. మడమ తిప్పను.. ఇక్కడే క్యాపిటల్ కడతానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు మూడు రాజధానులు కడతానని చెప్పే నైతిక హక్కులేదన్నారు. ఇప్పుడు ఎలా మాట తప్పుతారని తమ పార్టీ ప్రశ్నిస్తోందన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం గతంలో భాజపా విభజించిన రాష్ట్రాల్లో రాజధానులు నిర్మించుకున్న అంశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్లో రాజధాని కట్టారనీ.. హౌసింగ్బోర్డుతో సైలెంట్గా అక్కడ రాజధానిని నిర్మించుకున్నారన్నారు. అలాగే, ఝార్ఖండ్, ఉత్తరాంచల్లలో రాజధానులు నిర్మించుకున్నా.. ఏపీకి వచ్చేసరికి సరైన దిశ, దశ లేనటువంటి రాజకీయాలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాజధాని విషయంలో ఒక్క భాజపాకే కమిట్మెంట్ ఉందని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని.. అద్భుతమైన రాజధానిని అమరావతిలో కడతామని చెప్పారు.