Andhra news: ఏపీని అవినీతి రాష్ట్రంగా మార్చేశారు: సోము వీర్రాజు

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి బీసీలను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారని ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీలో సీఎంగా ఎన్నికైన వారంతా తమ కుటుంబాలకు దోచిపెట్టాలని ఆరాటపడుతున్నారని విమర్శించారు.

Published : 28 Nov 2022 01:41 IST

ఏలూరు: స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి బీసీలను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీని రాజధాని, అభివృద్ధి లేని అవినీతి రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు. బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని సీఎం చెబుతున్నా.. వారి కోసం ఒక్క కుర్చీ కూడా లేదన్నారు. ఏలూరులోని ఇండోర్‌ స్టేడియంలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సామాజిక చైతన్య సభలో తెలంగాణ భాజపా నేత లక్ష్మణ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. బీసీలను రాజకీయంగా ముందుంచడంలో భాజపా కృషి చేస్తోందన్నారు. భాజపా అధికారంలోకి వస్తే రూ.10వేల కోట్ల కాంట్రాక్టులు బీసీ కార్పొరేషన్లకు ఇస్తామని హామీ ఇచ్చారు. రూ.3 వేల కోట్లతో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని వాటికే అప్పగిస్తామని తెలిపారు. యూనిఫాం దుస్తుల కాంట్రాక్టును చేనేతలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీలో సీఎం పదవిలోకి వచ్చిన వారంతా తమ కుటుంబాలకు దోచిపెట్టాలని ఆరాటపడుతున్నారని సోము వీర్రాజు విమర్శించారు.

బీసీలకు రాజ్యాంగ హోదా కల్పించిన ఘనత భాజపాదే: లక్ష్మణ్‌

అనంతరం లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని అన్నారు. బీసీలకు రాజ్యాంగ హోదా కల్పించిన ఘనత భాజపాదేనని చెప్పారు. సమాజంలో ఇప్పటికే చాలా కులాలకు రిజర్వేషన్లు లేవని తెలిపారు. ‘‘ జాలర్ల కోసం మత్స్యశాఖ ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తాం. 40శాతం మంది బీసీలకు కేంద్రమంత్రులుగా అవకాశం కల్పిస్తాం.’’అని లక్ష్మణ్‌ అన్నారు. అధికారం పోతుందనే భయంతోనే  54 శాతం ఉన్న బీసీలకు గణనచేపట్టడం లేదా? అని ప్రశ్నించారు. భాజపా అధికారంలోకి వస్తే బీసీ కార్పొరేషన్లకు నిధులు, ఉపాధి కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, మద్యం మాఫియాను కట్టడి చేయడం భాజపాకే సాధ్యమని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని