‘రాత్రుళ్లు మంతనాలు.. పగలు లేఖలు’

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని పెద్ద డ్రామాగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభివర్ణించారు. కర్నూలులో సమావేశమైన ఆ పార్టీ రాష్ట్ర నేతలు .. రాయలసీమలో

Published : 10 Jul 2021 01:05 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

కర్నూలు: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని పెద్ద డ్రామాగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభివర్ణించారు. కర్నూలులో సమావేశమైన ఆ పార్టీ రాష్ట్ర నేతలు .. రాయలసీమలో నీటి ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ...పోలవరం మినహా రాష్ట్రంలో ప్రాజెక్టులు లేవా అని ప్రశ్నించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఒంగోలులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల మాటేమిటని నిలదీశారు. వీటిపై తర్వలోనే ఉద్యమిస్తామని, విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

రాత్రుళ్లు ముఖ్యమంత్రులిద్దరూ ఫోన్‌లో రహస్య మంతనాలు జరిపి, తెల్లారితే లేఖల పర్వం మొదలుపెడుతున్నారని ఎద్దేవా చేశారు. 2019లో జగన్‌ ప్రమాణ స్వీకారం రోజున.. కృష్ణా నీటి విషయంలో ఎలాంటి వివాదాలకు వెళ్లమని కేసీఆర్‌ అన్న మాటలు మరచిపోయారా అని ప్రశ్నించారు. కృష్ణాబోర్డు, బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉండగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకు లేఖలు రాస్తున్నారని నిలదీశారు. జగన్‌, సజ్జల రామకృష్ణారెడ్డి, షర్మిల మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. భద్రాచలం సహా చర్ల, వాజేడు, దుమ్ముగూడెం మండలాలను కోల్పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ చాలా నష్టపోయిందని గుర్తు చేశారు. ఎంపీలు టీజీ వెంకటేశ్‌, సీఎం రమేశ్‌, భాజపా నేతలు విష్ణువర్దన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని