Bharat Jodo Yatra: భారత్‌ జోడో యాత్రలో కదం కలిపిన సోనియా.. రాహుల్‌తో కలిసి నడక..!

కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. ఆమె గురువారం ఉదయం కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని జకన్నహళ్లికి చేరుకొన్నారు.

Published : 06 Oct 2022 10:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. గురువారం ఉదయం కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని జకన్నహళ్లికి చేరుకొన్నారు. పాండవపుర తాలుకాలో ఉదయం 6.30కు మొదలైన యాత్ర అక్కడకు చేరుకోగానే.. ఆమె కూడా వారితో కలిసి నడిచారు. ఈ యాత్ర సాయంత్రం 7 గంటలకు నాగమంగళ తాలుకాలో నేడు విరామం తీసుకోనుంది. సోనియాతోపాటు ఈ యాత్రలో స్థానిక మహిళా ఎమ్మెల్యేలు అంజలీ నంబాల్కర్‌, రూపకళా, లక్ష్మీ హెబ్బాల్కర్‌లు పాల్గొన్నారు. 

ఈ యాత్ర అనంతరం బ్రహ్మదేవరహళ్లి గ్రామంలో సభ నిర్వహించనున్నారు. ఈ సభ నాగమంగళ తాలుకాలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఎదుట ఉన్న మడకె హోసూరు గేట్‌ వద్ద జరగనుంది. యాత్ర వివరాలను కాంగ్రెస్‌ ట్విటర్‌లో ఉంచింది. ‘‘ప్రతిజ్ఞ చేసిన వారు వెనక్కి తగ్గరు.. లక్షల కష్టాలు వచ్చినా మనం భారత్‌ను కలుపుదాం.. భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ..’’ అని ట్వీట్‌ చేసింది. దీనికి సోనియా గాంధీ యాత్రలో పాల్గొన్న వీడియోను జత చేసింది.  

భారత్‌ జోడో యాత్ర సెప్టెంబర్‌ 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమైంది. ఈ యాత్ర గత శుక్రవారం చామరాజనగర్‌లోని గుండ్లుపేట్‌ వద్ద కర్ణాటకలో ప్రవేశించింది. ఆదివారం భారీగా తరలివచ్చిన జనసందోహం మధ్య మైసూర్‌ వద్ద ఓ బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా జోరు వానను లెక్కచేయకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. వర్షంలోనే పార్టీలో చేరికల ప్రక్రియ, నేతలంతా కలిసి అభివాదం చేయడం వంటివి చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని