తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల్లేవ్‌: శ్రీనివాస్‌గౌడ్‌

అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. కృష్ణా బేసిన్‌లో అవసరాలు తీరకుండానే పెన్నాకు

Updated : 02 Jul 2021 14:55 IST

హైదరాబాద్‌: అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. కృష్ణా బేసిన్‌లో అవసరాలు తీరకుండానే పెన్నాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులు లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శ్రీనివాస్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంలు ఇచ్చిన జీవోలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో ఏపీ ఏమైనా అవగాహన ఒప్పందం చేసుకుందా? అని ప్రశ్నించారు. నీటి పంపకాల్లో కేంద్రం కూడా వివక్ష చూపుతోందన్నారు. తెలంగాణలో ఎక్కువగా ఎత్తిపోతల పథకాల ద్వారానే సాగునీటి అవసరాలు తీరుతున్నాయని మంత్రి వెల్లడించారు.

వారు సెటిలర్స్‌ కాదు..

‘‘జలవివాదాల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్స్‌ను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని కొంత మంది నేతలు మాట్లాడుతున్నారు. వారు ఒకప్పుడు సెటిలర్స్‌ కావచ్చేమో.. ఇప్పుడు కాదు. వారంతా తెలంగాణకు చెందినవారే. ఉద్యమ సమయంలో కూడా సెటిలర్స్‌ అనే పదాన్ని మేం వాడలేదు. వారు ఇప్పటికీ సెటిలర్స్‌ అని మీరు ముద్ర వేస్తున్నారు. వారిలో చాలా మంది పిల్లలు ఇక్కడే పుట్టారు. ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాలి కదా అని అనేక మందిని అడిగాం. వారంతా అందుకు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ వచ్చిన తర్వాత వారి జీవన స్థితిగతులు మరింత మెరుగ్గా అయ్యాయని ఎంతో మంది చెప్పారు. వారు ఎప్పటికీ మా వారే’’ అని మంత్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని