అప్పుడే గెజిట్‌పై స్పందిస్తా: చంద్రబాబు 

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన గెజిట్‌పై పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు

Updated : 17 Jul 2021 13:16 IST

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన గెజిట్‌పై పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలోని రమేశ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా నేత బచ్చుల అర్జునుడిని పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. బచావత్‌ ట్రైబ్యునల్‌కు, గెజిట్‌కు ఉన్న వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాలని తెలిపారు. దీనిపై వైకాపా ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రం పట్ల సీఎం జగన్‌ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. ఇటీవల కృష్ణా జిల్లా పర్యటనలో చంద్రబాబుతో పాటు అర్జునుడు కూడా పాల్గొన్నారు. కార్యక్రమం ముగిశాక గుండెపోటు రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. అర్జునుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చంద్రబాబుకు తెలిపారు.  

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల అధికార పరిధిని నిర్దేశించే గెజిట్‌ నోటిఫికేషన్‌ను నిన్న విడుదల చేశారు. దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుల కంటే జాగ్రత్తగా రూపొందించినట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్‌ అవస్థి చెప్పారు. రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ అంశానికున్న సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని సీడబ్ల్యూసీ అధికారులు దీనిపై వ్యక్తిగత శ్రద్ధపెట్టి, రాత్రింబవళ్లు పనిచేసినట్లు ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని