CBN: హిడెన్‌ స్ప్రౌట్స్ కూల్చివేత హేయం: చంద్ర‌బాబు

విశాఖ న‌గ‌రంలో విభిన్న ప్ర‌తిభావంతుల‌కు లాభాపేక్ష లేకుండా నిస్వార్థ సేవ చేస్తున్న హిడెన్‌ స్ప్రౌట్స్‌ పాఠ‌శాల కూల్చివేత‌కు అనుమ‌తించ‌డం సిగ్గుచేటని తెదేపా అధినేత చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. ఈ మేర‌కు ఆయ‌న ఏపీ ప్ర‌భుత్వ

Updated : 09 Jun 2021 13:57 IST

ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి తెదేపా అధినేత లేఖ‌

అమ‌రావ‌తి: విశాఖ న‌గ‌రంలో విభిన్న ప్ర‌తిభావంతుల‌కు లాభాపేక్ష లేకుండా నిస్వార్థ సేవ చేస్తున్న హిడెన్‌ స్ప్రౌట్స్‌ పాఠ‌శాల కూల్చివేత‌కు అనుమ‌తించ‌డం సిగ్గుచేటని తెదేపా అధినేత చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. ఈ మేర‌కు ఆయ‌న ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(సీఎస్‌) ఆదిత్య‌నాథ్ దాస్‌కు లేఖ రాశారు. వైకాపా ప్ర‌భుత్వ కూల్చివేత చ‌ర్య‌ల్లో చోటు చేసుకున్న తాజా ఘ‌ట‌న అత్యంత హేయ‌మ‌ని మండిప‌డ్డారు. దీనికి బాధ్యులైన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవడంతో పాటు భవిష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చంద్రబాబు డిమాండ్ చేశారు. హిడెన్‌ స్ప్రౌట్స్‌ పాఠ‌శాల విద్యార్థుల‌కు న్యాయం చేయాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు. నాగ‌రిక స‌మాజంలో ఇటువంటి చ‌ర్య అస‌హ్య‌క‌ర‌మ‌న్నారు.

2013లో జీవీఎంసీ నుంచి లీజుకు తీసుకొని 190 మంది విద్యార్థుల‌తో న‌డుస్తున్న ఈ పాఠ‌శాలలో ఎక్కువ మంది ఆర్థికంగా వెనుక‌బ‌డిన కుటుంబాల వారే అని చంద్ర‌బాబు తెలిపారు. ఎలాంటి నోటీసులు లేకుండా పాఠ‌శాల ప్రాంగ‌ణాన్ని కూల్చివేసి స్వాధీనం చేసుకోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. చ‌ట్టం, న్యాయం, నిబంధ‌న‌ల‌ను విస్మ‌రించిన వైకాపా ప్ర‌భుత్వం అధికారంలో కొన‌సాగే నైతిక హ‌క్కును కోల్పోయింద‌ని ఆయ‌న‌ మండిప‌డ్డారు. నిజ‌మైన సేవాస్ఫూర్తితో స‌మాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న సంస్థ‌ల‌కు మ‌ద్ద‌తివ్వాల‌ని సీఎస్‌కు రాసిన లేఖ‌లో చంద్ర‌బాబు పేర్కొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని