Devineni uma: అర్ధరాత్రి హైడ్రామా.. దేవినేని ఉమా అరెస్ట్‌

 తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ దేవినేని ఉమా ఇతర నేతలతో కలిసి జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు ఆరుగంటల పాటు దేవినేని ఉమా తన కారులో కూర్చొని ఆందోళన

Updated : 28 Jul 2021 05:02 IST

అమరావతి: తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావును అర్ధరాత్రి దాటాక పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ దేవినేని ఉమా ఇతర నేతలతో కలిసి జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు ఆరుగంటల పాటు దేవినేని ఉమా తన కారులో కూర్చొని ఆందోళన చేపట్టారు. దీంతో అర్ధరాత్రి తర్వాత వాహనం అద్దాలు తొలగించి దేవినేనిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం తమ వాహనంలో దేవినేనిని ఎక్కించుకొని స్టేషన్‌కు తరలించారు.   

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిని అద్దాలు పగులగొట్టి అరెస్టు చేయడం దారుణమని తెదేపా నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నట్లు ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అరాచకమైన పరిపాలన జరుగుతోందనడానికి మైలవరంలో జరిగిన ఘటన ఉదాహరణ అని కొల్లు రవీంద్ర అన్నారు.  

మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై వైకాపా వర్గీయులు మంగళవారం రాళ్లదాడికి దిగారు. కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమమైనింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలపై దేవినేని ఉమా పరిశీలనకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఉమా కారును జి.కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద  వైకాపా వర్గీయులు అడ్డుకున్నారు. వాహనం చుట్టుముట్టి దాడికి దిగారు. మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ అనుచరులే దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ దేవినేని ఉమా జి.కొండూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. 

ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టించారు: డీఐజీ
దేవినేని ఉమా ఉద్దేశ పూర్వకంగా జి.కొండూరులో అలజడి సృష్టించారని డీఐజీ మోహన్‌రావు అన్నారు. దేవినేని ఉమా చర్యలపై ఫిర్యాదు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఉమాను అరెస్ట్‌ చేశామని, వంద శాతం పారదర్శకంగా విచారిస్తామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ అన్నారు. ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని