MLC Elections: వైకాపా పతనం ప్రారంభమైంది: తెదేపా శ్రేణులు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

Updated : 23 Mar 2023 21:38 IST

అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లి విరుస్తోంది. చంద్రబాబు నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చుతూ మిఠాయిలు పంచుకున్నారు. విజయం సాధించిన అనురాధను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అభినందించారు. సీఎం జగన్‌పై విరుచుకు పడ్డారు. ‘‘మేం 23 సీట్లే గెలిచామని ఎద్దేవా చేశారు. అందులో నలుగురిని సంతలో పశువుల్లా కొన్నారు. చివరికి అదే 23వ తేదీన అదే 23 ఓట్లతో మీ ఓటమి.. మా గెలుపు. ఇది కదా దేవుడి స్క్రిప్ట్‌ అంటే..’’ అంటూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. తెదేపా అభ్యర్థి విజయం సాధించడం పట్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. వైకాపా పతనం ఆరంభమైందని అన్నారు. 23 ఓట్లతో విజయం సాధించినా.. ప్రకటనలో జాప్యం చేశారని మండిపడ్డారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెడితే.. అనవసరంగా పోటీ పెట్టారంటూ ఇష్టారీతిన ఆరోపించారు. మా ఎమ్మెల్యేల మీద కూడా నిఘా పెట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా విందు రాజకీయాలు చేశారు. అయినా వాళ్లకు బుద్ధి చెప్పేలా తెదేపా విజయం సాధించింది’’ అని అచ్చెన్నాయుడు అన్నారు.

వైకాపా సింగిల్‌ డిజిట్‌కే: గోరంట్ల

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా కేవలం సింగిల్‌ డిజిట్‌కే  పరిమితం కాబోతోందని తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ నియంతృత్వ పోకడలు ప్రజలకు అర్థమయ్యాయని, అందుకే ఆ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికలే అందుకు నిదర్శనమన్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి దాదాపు రూ.250 కోట్లు ప్రకటిస్తే.. జగన్‌ మాత్రం కార్యాలయం వదిలి బయటకు రాలేదని విమర్శించారు.

ఇదే స్ఫూర్తితో ముందుకెళ్దాం: బాలకృష్ణ

అనురాధ గెలుపు ప్రజా విజయమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆమె విజయాన్ని అన్ని వర్గాల ప్రజల గెలుపుగా అభివర్ణించారు. ‘‘క్లిష్ట ఎన్నికల్లో అనురాద సునాయాస గెలుపు స్ఫూర్తిదాయకం. పట్టభద్రుల ఎన్నికల్లోనూ తెదేపా 3 స్థానాల్లో విజయం సాధించింది. చంద్రబాబు పోరాట స్ఫూర్తి, కార్యకర్తల కృషి వల్లే వరుస విజయాలు సాధించగలిగాం. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేసి.. తెదేపాను విజయపథంలో నిలబెట్టడమే మనందరి కర్తవ్యం’’ అని పార్టీ శ్రేణులకు బాలకృష్ణ పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు: ఆనంద్‌ బాబు

దేశంలో ప్రజాస్వామ్యం గొప్పతనం ఇవాళ చూశామని తెదేపా నేత నక్కా ఆనందబాబు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేశారన్నారు. ‘‘ వైకాపా నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. వైకాపా హయాంలో ప్రజాప్రతినిధులకు విలువ లేదు. జగన్‌కు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ వైకాపాకు ప్రజలు గుణపాఠం చెబుతారు.’’ అని ఆనంద్‌బాబు అన్నారు.

వైకాపా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి: చినరాజప్ప

‘‘ తెదేపాతో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పాం. ఆత్మప్రభోదం మేరకు ఓటు వేయడంతో విజయం సాధించాం. పట్టభద్రుల ఎన్నికల్లోనూ 3 స్థానాల్లో గెలుపొందాం. వైకాపాపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు జగన్‌పై అసంతృప్తితో ఉన్నారు.’’ అని చినరాజప్ప అన్నారు.

కొత్త జోష్‌ వచ్చింది: కంభంపాటి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం సాధించడం పట్ల రాజ్యసభ మాజీ సభ్యుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహన్‌రావు అభినందనలు తెలిపారు. ఆమె విజయానికి కృషి చేసిన ఎమ్మెల్యేలకు, నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ తెదేపా కేడర్‌లో కొత్త జోష్‌ నింపే విజయమిది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల గెలుపు ఇది. వైకాపా హింస, విద్వేషాలపై ఇది తిరుగుబాటు. ఇటీవల 3 స్థానాల్లో విజయం సాధించడంతోపాటు, తాజాగా బరిలో నిలిచిన ఏకైక స్థానంలోనూ విజయం సాధించడం తెదేపా పోరాట స్ఫూర్తికి అద్దంపడుతున్నాయి’’ అని కంభంపాటి తెలిపారు.

జగన్‌కు ఇదే రిటర్న్‌ గిఫ్ట్‌ :గంటా

దేశ ప్రజలందరూ ఆనందంతో ఉన్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.  తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇది 2023వ సంవత్సరం, 23వ తేదీ, 23 ఓట్లతో గెలిచాం. ఇదే జగన్‌కి రిటర్న్‌ గిఫ్ట్‌. ఉత్తరం లేదు.. దక్షిణం లేదు.. పట్టభద్రుల ఎన్నికల్లో దుమ్ము దులిపారు. 9 జిల్లాల్లో 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తెదేపా ప్రభంజనం కనిపించింది. తెదేపాకు ఆకర్షణ తెచ్చింది.  మొన్న పట్టభద్రుల ఎన్నికలను సెమీఫైనల్‌ అన్నారు. అందులోనే ఓడిపోయారు.  ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. జగన్‌ ఒక్క ఛాన్స్‌ అంటే ఇచ్చారు.. అది పూర్తయింది. ఇక జగన్‌ అంతం ప్రారంభమైంది. రానున్న  అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపాకు పట్టంకట్టడం ఖాయం’’ అని గంటా శ్రీనివాసరావు అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని