Andhra News: వాచిపోయిన చేతులు చూపించిన పట్టాభి.. జడ్జి ముందు హాజరుపర్చిన పోలీసులు

తెదేపా నేతలను కోర్టుకు తరలించే క్రమంలో గన్నవరం పోలీస్‌ స్టేషన్‌ వద్ద తెలుగుదేశం శ్రేణులు నిరసనకు దిగారు. పోలీసుల ఆంక్షలు ఛేదించుకుని కేశినేని చిన్ని, వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు పీఎస్‌కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Updated : 21 Feb 2023 17:12 IST

గన్నవరం: తెదేపా(TDP) జాతీయ అధికార ప్రతినిధి  కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌,(pattabhi) దొంతు చిన్నా, గురుమూర్తి సహా అరెస్టు చేసిన 11 మంది తెలుగుదేశం నేతలను గన్నవరం (Gannavaram) కోర్టుకు తీసుకువచ్చారు. స్థానిక అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో న్యాయమూర్తి ఎదుట వారిని పోలీసులు హాజరుపర్చారు. కోర్టుకు వెళ్తూ పట్టాభి వాచిపోయిన చేతులు చూపించారు. చేతులు కమిలిపోయాయని చూపిస్తూ కోర్టు లోపలికి వెళ్లారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నిన్న జరిగిన ఘటనల నేపథ్యంలో పట్టాభితో పాటు తెదేపా నేతలను అరెస్టు చేసిన  విషయం తెలిసిందే. గన్నవరం పీఎస్‌లోనే తెదేపా నేతలకు  వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు. పోలీసులు తన భర్త పట్టాభిరామ్‌ను దారుణంగా హింసించారని ఆయన భార్య చందన ఆరోపించారు. ఉన్నతాధికారుల సహకారంతోనే ఇదంతా జరిగిందని విమర్శించారు. తోట్లవల్లూరు పీఎస్‌లో తన భర్తను ముసుగు ధరించిన ముగ్గురు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి ఇంత ఆందోళనగా ఎప్పుడూ కనిపించలేదన్నారు. 

తెదేపా నేతలను కోర్టుకు తరలించే క్రమంలో గన్నవరం పోలీస్‌ స్టేషన్‌ వద్ద తెలుగుదేశం శ్రేణులు నిరసనకు దిగారు. పోలీసుల ఆంక్షలు ఛేదించుకుని కేశినేని చిన్ని, వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు పీఎస్‌కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ కేసులు వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గన్నవరం కోర్టు వద్దకు చేరుకున్నారు.

పట్టాభిని తీవ్రంగా హింసించారు: గొట్టిముక్కల

నిన్న సాయంత్రం నుంచి కొమ్మారెడ్డి పట్టాభిని కొడుతూ వివిధ పోలీస్‌స్టేషన్లకు తిప్పారని టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టి ముక్కల రఘురామరాజు మండిపడ్డారు. చివరిగా తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి కరెంటు తీసేశారని ఆరోపించారు.  ముగ్గురు వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చి పట్టాభిని తీవ్రంగా హింసించారని రఘురామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాభి ముఖానికి కూడా ముసుగువేసి ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు