Chandrababu: ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’.. ఎన్నికల వరాలు ప్రకటించిన చంద్రబాబు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో నిర్వహించిన మహానాడు వేదిక  తెదేపా తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించారు. కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు.

Updated : 29 May 2023 01:04 IST

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో నిర్వహించిన మహానాడు వేదికగా తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించారు. కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఖాతాల్లో వేస్తామన్నారు. మహిళల కోసం ‘మహాశక్తి’ కార్యక్రమం తెస్తామని వెల్లడించారు. ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు.

‘తల్లికి వందనం’ పేరుతో ఏటా రూ.15వేలు..

‘తల్లికి వందనం’ పేరుతో ప్రతి బిడ్డా చదువుకునేందుకు ఏటా రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ ఇస్తామన్నారు. స్థానిక సంస్థల్లో పోటీకి పిల్లల నిబంధన ఎత్తివేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు.. ఇకపై ఆ నిబంధన రద్దు చేస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు. యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేలు చొప్పున ఇస్తాం. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందన్నారు. యువగళం కింద 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

రైతులకు ఏటా రూ.20వేలు ఇస్తాం..

‘‘అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్‌ను అప్పులపాలు చేశారు. రైతు కోసం అన్నదాత కార్యక్రమం తెస్తాం.  ప్రతి రైతుకు ఏటా రూ.20వేలు ఇస్తాం. బీసీలపై దాడులు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక. బీసీలకు రక్షణ కోసం చట్టం తెస్తాం. బీసీలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. బీసీల అభివృద్ధికి నాది బాధ్యత. ఇంటింటికీ తాగునీరు అందిస్తాం. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌ ఇస్తాం. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో పేదలను ధనికులను చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. సంపద సృష్టిస్తాం. సృష్టించిన సంపద పేదవాళ్లకు పంచుతాం. దసరా సమయానికి పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రకటిస్తాం. రూ.2వేల నోట్లు రద్దు చేశారు. రూ.500 నోట్లు కూడా రద్దు చేయాలని కోరుతున్నా. తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఎన్నికల మేనిఫెస్టోను తెలియజేయాలి’’ అని చంద్రబాబు సూచించారు. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధం కావాలని ప్రజలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు