సీఎస్‌ పదవీకాలం పొడిగించొద్దు: కనకమేడల

తీవ్ర నేరారోపణలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ పదవీకాలం పొడిగింపు తగదని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్

Published : 18 Jun 2021 15:03 IST

అమరావతి: తీవ్ర నేరారోపణలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ పదవీకాలం పొడిగింపు తగదని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్ (డీవోపీటీ)కి తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ లేఖ రాశారు. 

‘‘జూన్‌ 30వ తేదీకి ఆదిత్యనాథ్‌దాస్‌ పదవీ విరమణ చేయాల్సి ఉంది. 2013లో జగన్‌ మోహన్‌రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన క్విడ్‌ ప్రోకో కేసుల్లో ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. జలవనరుల శాఖ కార్యదర్శిగా ఇండియా సిమెంట్స్‌కు అనధికారికంగా 10లక్షల లీటర్ల నీటి కేటాయింపులో అవసరమైన సహాయ సహకారాలు అందించారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఇండియా సిమెంట్స్‌లో పెట్టుబడులు పెట్టారు.  అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆదిత్యనాథ్‌దాస్‌పైనా సీబీఐ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. తర్వాతి కాలంలో తెలంగాణ హైకోర్టు దాస్‌పై ఉన్న కేసులు రద్దు చేసినప్పటికీ,  2019 సెప్టెంబరులో ఆ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తిరిగి నోటీసులు జారీ చేసింది. వ్యక్తి గత లాభాల కోసం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా  ప్రభుత్వ సేవలు దుర్వినియోగం చేసిన ఆదిత్యనాథ్‌దాస్‌కు సీఎస్‌గా పదవీకాలం తదుపరి పొడిగింపు సరికాదు’’ అని కనకమేడల రవీంద్రకుమార్ లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని