ఇది నిజాం కాలం కాదు..మోదీ హయాం

అతి సామాన్యుడు కూడా నాయకుడు కాగలగడం భాజపాలోనే సాధ్యమని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య అన్నారు.

Updated : 23 Nov 2020 17:42 IST

బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య

హైదరాబాద్‌: అతి సామాన్యుడు కూడా నాయకుడు కాగలగడం భాజపాలోనే సాధ్యమని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య అన్నారు. కేసీఆర్‌, ఓవైసీ రాజకీయాలను ప్రైవేటు సంస్థలుగా మార్చారని విమర్శించారు. సికింద్రాబాద్‌లోని మెహబూబ్‌ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ‘‘ఛేంజ్‌ హైదరాబాద్‌’’ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. తెరాస, ఎంఐఎంలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని ఆరోపించారు.  భాజపా ఏ వ్యక్తికీ సంబంధించిన పార్టీ కాదని స్పష్టం చేశారు. దేశ ప్రజలు కుటుంబ రాజకీయాలను తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. కశ్మీర్‌లో రెండు రాజకీయ కుటుంబాలను ప్రజలు శాశ్వత క్వారంటైన్‌కు పంపారని, తెలంగాణలోనూ అదే జరగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ‘‘ఛేంజ్‌ హైదరాబాద్‌’’ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇది నిజాం కాలం కాదు.. మోదీ హయాం అని ప్రజలు గుర్తించాలన్నారు.

అవకాశం ఇస్తే చేసి చూపిస్తాం: బండి సంజయ్‌

గతంలో ఇచ్చిన హామీలను తెరాస ప్రభుత్వం నెరవేర్చలేదని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయిందని విమర్శించారు.  బస్తీల్లో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని, కేంద్రం హైదరాబాద్‌కు 2 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. వాటిని కూడా తెరాస ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను తెరాస ఛిన్నాభిన్నం చేసిందని సంజయ్‌ ఆరోపించారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదని ఎద్దేవా చేశారు. పేదలకు కష్టమొచ్చినా ముఖ్యమంత్రి స్పందించట్లేదని విమర్శించారు. భాజపాకు ఒకసారి అవకాశమిస్తే భాగ్యనగరం రూపురేఖలు మారుస్తామని బండి సంజయ్‌ హామీ ఇచ్చారు.

మాటల రాజకీయం కాదు.. మాది చేతల రాజకీయం: కిషన్‌రెడ్డి

బల్దియా రాజకీయాల్లో పెనుమార్పుకోసం భాజపా ప్రయత్నిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. దేశంలో 80 శాతం మున్సిపల్‌ కార్పొరేషన్లలో భాజపానే అధికారంలో ఉందన్నారు.  దేశంలో 17 రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉందని గుర్తు చేశారు. భాజపా పాలనలో అరాచకం కొనసాగుతుందని చెప్పడం దుష్ప్రచారమేనని అన్నారు. విధ్వాంసాన్ని కూకటివేళ్లతో పెకలించే పార్టీ భాజపా అని స్పష్టం చేశారు. ‘‘మా పై అరాచకం, విధ్వంసం అనే ముద్రలు వేస్తారా?విధ్వంసం లేని రాజకీయాలనే భాజపా కోరుకుంటోంది. తెరాస, ఎంఐఎం భూ ఆక్రమణలకు పాల్పడుతున్నాయి. మాది మాటల రాజకీయం కాదు. చేతల రాజకీయం’’ అని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని