Ts News: భాజపా అంటే బిర్యానీ అనుకున్నారా కేసీఆర్..: మధ్యప్రదేశ్‌ సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిరికివాడని.. ఇలాంటి సీఎంను తానెక్కడా చూడలేదని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణ

Published : 08 Jan 2022 01:36 IST

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిరికివాడని.. ఇలాంటి సీఎంను తానెక్కడా చూడలేదని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఆయన అభినందించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ హాజరై మాట్లాడారు. విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. ఉద్యమిస్తే భయపడి అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. భాజపా చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడానికే తెలంగాణ గడ్డపైకి వచ్చినట్లు చెప్పారు.

‘‘మీ బెదిరింపులకు భయపడే పార్టీ కాదు భాజపా. కేసీఆర్‌కు కలలో కూడా బండి సంజయ్‌ గుర్తొస్తున్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోంది. కేసీఆర్ నేను కూడా సీఎంనే. నువ్వు రెండోసారి సీఎం కావొచ్చు... నేను నాలుగోసారి సీఎంగా కొనసాగుతున్నా. మీలాగా సంస్కార హీనంగా వ్యవహరించడం లేదు. భాజపా అంటే బిర్యానీ అనుకున్నారా? డబుల్ బెడ్‌ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది? వీటికి జవాబు ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో ధర్మయుద్దం మొదలైంది. అవినీతి-నియంత-కుటుంబ పాలనను అంతం చేసేందుకు సంజయ్ చేస్తున్న పోరాటం అభినందనీయం. 2023లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చి తీరుతుంది. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడుతుంది’’ అని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తెలిపారు.

సీఎం స్పందించకపోవడమంటే.. సమర్థించడమే..: బండి సంజయ్‌

317 జీవోపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించే వరకు భాజపా పోరాటం చేస్తూనే ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. భాజపా ప్రభుత్వం వచ్చాక ఈ ఉత్తర్వును రద్దు చేస్తామన్నారు. ఉద్యోగులు మరో 2 సంవత్సరాలు ఓపిక పట్టాలని సూచించారు. భాజపా చేస్తోన్న పోరాటానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మద్దతివ్వాలని కోరారు. నలుగురి ఆత్మహత్యకు తెరాస నేత కారణమయ్యాడని.. అలాంటి కామాంధుడిపై సీఎం కేసీఆర్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామాంధుడికి శిక్ష పడాలని అన్ని సంఘాలు కోరుతున్నాయన్నారు. పాల్వంచ ఘటనపై సీఎం స్పందించకపోవడమంటే.. ఆ ఘటనను సమర్థించడమే అవుతుందని పేర్కొన్నారు. నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలోనే నిందితుడిపై చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి ఘటన జరిగేది కాదని బండి సంజయ్‌ అభిప్రాయపడ్డారు.   

రాజకీయ పోరాటం కొనసాగిస్తాం: లక్ష్మణ్‌

తెరాస అవినీతి, నియంతృత్వ పాలనను తరిమికొట్టే వరకు విశ్రమించేది లేదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. అరెస్టుల వల్ల భాజపా కార్యకర్తలు భయపడరనే విషయాన్ని గ్రహించాలన్నారు. రాజకీయ పోరాటం కొనసాగిస్తామని చెప్పడానికే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ హైదరాబాద్‌ వచ్చినట్లు చెప్పారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్ష్మణ్‌ మాట్లాడారు. ఎల్లుండి అస్సాం ముఖ్యమంత్రి వరంగల్‌ వస్తున్నారని.. 317జీవో సవరణ పోరాటంలో పాల్గొంటారని వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. మంత్రి కేటీఆర్ భాజపా నాయకులపై దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాషాయ జెండా ఎగరడం ఖాయమని లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ను నిద్రపోకుండా చేస్తాం: డీకే అరుణ

‘‘తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందే స్థానికులకు ఉద్యోగాలు రావట్లేదని.. 317 జీవో తీసుకువచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు తెరాస నాయకులకు వర్తించవా? రైతుబంధు పేరుతో గ్రామాల్లో సంబురాలు జరుపుతున్నారు. బండి సంజయ్ జన జాగరణ దీక్ష చేస్తానంటే కొవిడ్ నిబంధనల పేరుతో అరెస్టు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించని తెరాస నేతలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? భాజపా నేతలు, శ్రేణులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. తరిమి తరిమి కొడతాం. సీఎం కేసీఆర్‌కు నిద్ర లేకుండా చేస్తాం’’ అని డీకే అరుణ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు