TS Congress: పోరాటాలకు సిద్ధం కావాలి.. సమావేశంలో కాంగ్రెస్‌ నేతల నిర్ణయం

తెలంగాణలో పోడు భూములు, ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.ఈ పోరాటాలను చాలా కీలకంగా భావించి పని చేద్దామని పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు.

Published : 20 Nov 2022 01:44 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పోడు భూములు, ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, కిసాన్‌సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి,  సీనియర్‌ నేతలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, షబ్బీర్‌ అలీ, అన్వేష్‌రెడ్డి, ప్రీతమ్‌, అయోధ్యరెడ్డి తదితరులతో కలిసి హైదరాబాద్‌ గాంధీభవన్‌లో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు.

రాష్ట్రంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న పోడు భూములు, ఇతర భూమి అంశాలు, ధరణి పోర్టల్‌, ఓబీసీ, ఈ ఏడాది వానాకాలం మార్కెటింగ్‌ సీజన్‌లో ధాన్యం సేకరణ, క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులపై విస్తృతంగా చర్చించారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఓటమిపై సమీక్షించారు. ధాన్యం కొనుగోలు సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ప్రకృతి విపత్తుల కారణంగా 15లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారంతో పాటు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అసైన్డ్‌ భూములను సీలింగ్‌ ల్యాండ్ పేరిట ప్రభుత్వం పేదల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తోందని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా తెరాస, భాజపా నాటకాలాడుతున్నాయని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. గతంలో కూడా నయీం కేసు, మాదక ద్రవ్యాల కేసు, ఆర్టీసీ కార్మికుల ధర్నా వంటి అంశాలను వివాదాస్పదం చేశారని గుర్తు చేశారు.

పశ్చిమ్‌బెంగాల్‌ తరహా రాజకీయాలు తెలంగాణలో కూడా చేయాలనుకుంటున్నారని ఆక్షేపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకం కింద 47లక్షల మందికి రూ.25వేల కోట్లు చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ సీఎం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. ఇక నుంచి అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరాపార్క్‌ వద్ద రెండ్రోజులు దీక్ష చేపట్టాలని తెలిపారు. దశల వారీగా పోరాటాలు చాలా అవసరమని, వ్యవసాయం.. రైతుల అంశాలు ఇప్పుడు చాలా కీలకమని ఎంపీ ఉత్తమ్‌ ప్రస్తావించారు. తొలుత నియోజకవర్గాల్లో పోరాటాలు చేసి రైతులు, ఇతర వర్గాల నుంచి అభిప్రాయాలు, డిమాండ్లపై సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం సమర్పించాలన్నారు. 32 జిల్లాల్లో ఆందోళనలు చేసిన తర్వాత గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పోరాటాలను చాలా కీలకంగా భావించి పని చేద్దామని పార్టీ నేతలు, శ్రేణులకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని