Harish Rao: భాజపా నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదు: హరీశ్‌రావు

భాజపా నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదని.. చెప్పిన అబద్ధాలే మళ్లీ మళ్లీ చెబుతున్నారని తెలంగాణ మంత్రి

Updated : 04 Jul 2022 15:33 IST

హైదరాబాద్: భాజపా నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదని.. చెప్పిన అబద్ధాలే మళ్లీ మళ్లీ చెబుతున్నారని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో భాజపా నిర్వహించిన విజయ సంకల్ప సభలో నీళ్లు, నియామకాల విషయంలో కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్పందించారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయం వేదికగా కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు.

‘‘అమిత్‌షా.. తెలంగాణలో నీళ్లు వచ్చింది నిజం కాదా? నీళ్లు ఎలా వచ్చాయో ఇక్కడి రైతులే చెబుతారు. నీళ్లు వచ్చాయనేందుకు పండిన పంటలే నిదర్శనం. ₹లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీళ్లు రానిదే ధాన్యం ఎలా వచ్చింది? మీరెలా కొన్నారు?’’ అని హరీశ్‌ ప్రశ్నించారు.

అమిత్‌షా.. మీ స్థాయిని తగ్గించుకోవద్దు!

‘‘పంజాబ్‌ తర్వాత అత్యధికంగా వరి పండించేది.. తెలంగాణ అని నీతి అయోగ్‌ చెప్పింది. గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణ బీడు భూముల్లో పారాయి. నీళ్ల గురించి భాజపా కార్యకర్తలను కాదు.. తెలంగాణ రైతుల్ని అడిగితే చెప్తారు. దేశంలో సగటున 3శాతం వ్యవసాయ వృద్ధిరేటు ఉంటే తెలంగాణలో 10శాతం ఉంది. అమిత్‌షా అవగాహన లేకుండా మాట్లాడి స్థాయిని తగ్గించుకోవద్దు. తప్పుగా రాసిచ్చిన స్క్రిప్టును మీరు చదివారని ప్రజలు అనుకుంటున్నారు’’ అని హరీశ్‌ విమర్శించారు.

మోదీ తప్ప.. దేశ ప్రధానులందరూ అమలు చేశారు

‘‘తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశానికే రోల్‌మోడల్‌. సంపద పెరిగింది కాబట్టే పెన్షన్‌ ₹200 నుంచి ₹2వేలకు పెంచాం. నిధులు దక్కినందువల్లే సాగుకు కాళేశ్వరం.. తాగుకు మిషన్ భగీరథ నీళ్లు అందిస్తున్నాం. కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులిస్తే మరింత అభివృద్ధి జరిగేది. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు ప్రధాని ప్రకటిస్తారని అనుకున్నాం. ఆర్థిక సంఘం సిఫార్సును మోదీ తప్ప దేశ ప్రధానులందరూ తప్పకుండా అమలు చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని భాజపా మేనిఫెస్టోలో చెప్పింది. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు ఇప్పటికీ భర్తీ చేయలేదు. తెలంగాణలో ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నాం. ప్రధాని ప్రసంగంలో కూడా అబద్ధాలే చెప్పారు. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ 26లక్షల కుటుంబాలకే వర్తిస్తుంది.  ఆరోగ్యశ్రీ మాత్రం 86 లక్షల కుటుంబాలకు వర్తిస్తుంది. ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ  మెరుగైన పథకం. 8ఏళ్లుగా మహిళా రిజర్వేషన్‌ చట్టాన్ని కేంద్రం ఎందుకు తీసుకురావట్లేదు. ₹1050గా ఉన్న సిలిండర్‌ ధరను తగ్గిస్తామని ఎందుకు చెప్పలేదు’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని