Harish rao: బడ్జెట్‌ 2023.. అందమైన మాటలు తప్ప కేటాయింపుల్లేని డొల్ల బడ్జెట్‌: హరీశ్‌రావు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేటాయింపుల విషయంలో తెలంగాణ మంత్రులు అసంతృప్తిగా ఉన్నారు. కేంద్ర బడ్జెట్‌లో డొల్లతనం కనిపిస్తోందని మంత్రులు ఆరోపించారు.

Updated : 01 Feb 2023 20:27 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ (Budget 2023)లో డొల్లతనం కనిపిస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. అందమైన మాటలు తప్ప కేటాయింపులు లేని డొల్ల బడ్జెట్ అని విమర్శించారు. బడ్జెట్‌లో ఏడు ప్రాధాన్యత రంగాలను కేంద్రం గాలికొదిలేసిందని ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం మరోసారి తీవ్ర అన్యాయం చేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన హామీల అమలు ప్రస్తావనే లేదని.. 9 ఏళ్లుగా అడుగుతుంటే రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఊసేలేదని అసహనం వ్యక్తం చేశారు.

‘‘ నేతన్నలకు జీఎస్టీ రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. ఎరువులకు రాయితీలు భారీగా తగ్గించారు. నర్సింగ్‌, వైద్య కళాశాలల విషయంలో తెలంగాణకు మళ్లీ మొండి చేయి చూపారు. పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల సంఖ్యను కుదించారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలుకు గతేడాది రూ.9,243 కోట్లు కేటాయించి, ఈ సారి కేవలం లక్ష రూపాయలు మాత్రమే కేటాయించడం పత్తి పండించే రైతులకు తీవ్ర నష్టం చేసే చర్యే. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను కేంద్రం పాటించడం లేదు. సెస్సులు, సర్‌ ఛార్జీల వల్ల రాష్ట్రాలు  పన్నుల వాటా కోల్పోతున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాలను భారీగా కుదించారు’’ అని హరీశ్‌రావు ఆరోపించారు.

కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వం: నిరంజన్‌రెడ్డి

‘‘కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వం. వ్యవసాయ రంగ కేటాయింపులు 22 శాతం తగ్గించారు. ఎరువుల రాయితీకి కేంద్రం మెల్లగా మంగళం పాడుతోంది. ఇప్పటికే ఎరువులు, డీజిల్‌ ధరలతో రైతులపై భారం పడుతోంది. ఉపాధి హామీ పథకానికి రూ.29,400 కోట్లు కోత కోశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ప్రయోజనం లేని ఫసల్‌ బీమాకు రూ.1,249 కోట్లు కేటాయించారు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కనుమరుగైనట్లే. సీసీఐకి నిధుల తగ్గింపుతో పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది’’ అని నిరంజన్‌రెడ్డి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని