
Prashant Kishor: పీకే కాంగ్రెస్లో చేరనున్నారా?
కాంగ్రెస్ వర్గాల్లో ఊహాగానాలు
దిల్లీ: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ ఓ హాట్ టాపిక్గా మారారు. ఆయన ఎక్కడ ప్రత్యక్షమైతే అక్కడ ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఆ మధ్య ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలవడంతో భాజపాకు ప్రత్యామ్నాయ కూటమి సిద్ధం చేయడంలో ప్రశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారంటూ చర్చలు జరిగాయి. తాజాగా ఆయన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ వాద్రాతో మంగళవారం భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరనున్నారనే ప్రచారం దిల్లీ వర్గాల్లో జరుగుతోంది.
కాంగ్రెస్ అగ్రనేతలు-ప్రశాంత్ కిశోర్ భేటీపై కాంగ్రెస్లోని ఓ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ.. ‘ఎన్నికల వ్యూహాలకు మించిన చర్చలు జరిగి ఉంటాయి’ అని అన్నట్లు ఓ ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ పేర్కొంది. దీంతో ఆ చర్చలు పీకే కాంగ్రెస్ చేరికపైనే అయి ఉంటాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది జరిగే ఉత్తర్ప్రదేశ్, పంజాబ్ శాసనసభ ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తొలుత అంతా భావించారు. కానీ, అంతకంటే ప్రధానమైన అంశాలపై మంతనాలు జరిగినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాషాయ పార్టీని అధికారం నుంచి తప్పించే సూత్రీకరణను పీకే ప్రతిపాదించారని సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున కీలక పాత్ర పోషించే అవకాశం పీకే ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలో ఏ స్థాయిలో ఆయనను చొప్పించాలనే దానిపై చర్చలు జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్తో గతనెల 11న ముంబయిలో ప్రశాంత్ కిశోర్ (పీకే) తొలిసారి భేటీ అయిన విషయం తెలిసిందే. మళ్లీ 21న దిల్లీలోనూ ఆయన్ను కలిశారు. దాదాపు 3 గంటల పాటు వారిద్దరూ ఏకాంతంగా సమాలోచనలు జరిపారు. అంతకు ముందురోజే 8 విపక్ష పార్టీల నేతలు పవార్తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లేకుండా 2024 ఎన్నికల్లో భాజపాను గద్దె దించడం సాధ్యపడదని పవార్, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీలు నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. ఈ క్రమంలో వారి దూతగా కాంగ్రెస్ అగ్రనేతలతో పీకే భేటీ అయ్యారన్న వాదన కూడా ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.