ఒక్క రూపాయికే ఇల్లు ఇవ్వటం కొందరికి నచ్చటం లేదు: బొత్స

ఒక్క రూపాయికే పేదలకు ఇళ్లు ఇవ్వటం కొందరికి నచ్చటం లేదని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

Published : 30 Jul 2021 01:11 IST

అమరావతి: ఒక్క రూపాయికే పేదలకు ఇళ్లు ఇవ్వటం కొందరికి నచ్చటం లేదని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టిడ్కో ఇళ్లకు నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లో రూ.480 కోట్లు ప్రజాధనం పొదుపు అయ్యాయని, ఇవేవీ ప్రతిపక్షాలు సహించటం లేదని విమర్శించారు. పేదలకు 340 చదరపు అడుగుల ఇళ్లు ఇస్తుంటే పనిగట్టుకుని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చేందుకు  ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ప్రయత్నిస్తోందన్నారు. గతంలో షీర్‌వాల్‌ టెక్నాలజీ అని హడావుడిగా మొదలుపెట్టి మధ్యలోనే వదిలేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో 4.54లక్షల ఇళ్లకు ఉత్తర్వులు ఇచ్చి, 3.13లక్షల ఇళ్లు కడతామని.. కేవలం 51,616 ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టారని ఆరోపించారు. ఒక్కచోట కూడా రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. 2.62లక్షల ఇళ్లు కట్టించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వివరించారు. తొలి విడతలో 90వేల ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పన కూడా 100 రోజుల్లోనే పూర్తిచేయాలని ఆదేశించామన్నారు. మిగతా ఇళ్లను మరో 12 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన 240 అడుగుల ఇల్లు..  భవంతా? అని మంత్రి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని