Bandi Sanjay: బండి సంజయ్‌ పాదయాత్రకు పేరు ఖరారు

భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు.

Updated : 13 Aug 2021 12:34 IST

ప్రకటించిన భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌

హైదరాబాద్‌: భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయన పాదయాత్ర పేరును భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రకటించారు. చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో మాజీ మంత్రులు బాబూమోహన్‌, చంద్రశేఖర్‌తో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండి సంజయ్‌ పాదయాత్రకు ‘ప్రజా సంగ్రామ యాత్ర’గా నామకరణం చేసినట్లు రాజాసింగ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో మార్పు తీసుకురావడానికే ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి భాజపా కార్యకర్త దీనిలో పాల్గొంటారన్నారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే పాదయాత్ర ఉద్దేశమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తెరాస ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.

2023 వరకు విడతల వారీగా బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగుతుందని రాజాసింగ్‌ చెప్పారు. తొలి దశలో చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి హుజూరాబాద్‌ వరకు చేపడతామన్నారు. పాదయాత్ర విజయవంతానికి 29 కమిటీలు ఏర్పాటు చేసినట్లు  ఆయన చెప్పారు. రాష్ట్రంలో అధికార తెరాసకు అసలైన ప్రత్యర్థి భాజపానేనని.. 2023 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని రాజాసింగ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని